ఇప్పుడు కర్నాటకలోని దళితులకు హీరోలు ఈ అన్నదమ్ములు. షేవింగ్ చేస్తున్నారు వీళ్లు హీరోలేంటీ అనుకుంటున్నారా ? అసలు విషయం తెలిస్తే మీరు కూడా వాళ్లని అభినందిస్తారు.
మైసూర్ కప్పసోగే గ్రామానికి చెందిన కెపి మహదేవ, కెపి సిద్ధరాజులు అన్నదమ్ములు. దళిత కులానికి చెందిన వీళ్లకి గ్రామంలో సెలూన్ల షాపు ఓనర్లు హెయిర్ కట్ చేయమని గెంటేశారు. అగ్రవర్ణాల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోందన్న భయంతో సెలూన్ షాపు ఓనర్లు దళితులను దూరం పెట్టారు.
కప్పసోగే దళిత యువకులు హెయిర్ కట్ కోసం పరిసరగ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రయాణ ఖర్చులతో పాటు ఆ రోజు కూలీ పని కూడా పోతోంది. ఈ సమస్యకి పరిష్కారం వెతికారు ఈ అన్నదమ్ములు. ఓ వైపు కూలీ పనులు చేసుకుంటూనే మరోవైపు బార్బర్లుగా మారారు.
దళితులు ఎక్కువగా ఉండే కురుహుండి, గౌదరాహుండి, మదనహళ్లికి చెందిన పురుషులకు హెయిర్ కటింగ్, షేవింగ్ చేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు కోరనా టైమ్ కాబట్టి ఇంటికే వచ్చి బార్బర్ సేవలు చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటికీ హెయిర్ కటింగ్ కి 40, షేవింగ్ కి 20 లు మాత్రమే తీసుకుంటున్నారు.
గత 8 ఏళ్లుగా దళిత గ్రామస్తులకు బార్బర్ సేవలు అందిస్తోన్న ఈ అన్నదమ్ములు ప్రభుత్వం సహకారం అందిస్తే ఊరూరా బార్బర్ షాపులు తెరుస్తామని చెబుతున్నారు. ఈ టెక్నాలజీ యుగంలోనూ ఇంకా కులవివక్ష ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పడానికి ఈ అన్నదమ్ములే సాక్ష్యం.