ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మెన్ సైరస్ మిస్త్రీ ఆదివారం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో మిస్త్రీతో పాటు మరో ప్రయాణికుడు కూడా చనిపోయాడు. అయితే ఆ ఇద్దరూ కారు సీటు బెల్టు పెట్టుకోలేదని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. మెర్సీడీజ్ కారు అతివేగంగా వెళ్లినట్లు గుర్తించారు. ఆ వేగంలో డ్రైవర్ సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే కారు డివైడర్ను ఢీకొట్టినట్లు విచారణలో పోలీసులు అనుమానిస్తున్నారు. కారు వేగం చాలా ఎక్కువగా ఉందని, మెర్సిడీజ్ కారు కేవలం 9 నిమిషాల్లోనే 20 కిలోమీటర్లు ప్రయాణించిందని, మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చారోటి చెక్ పోస్టు దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
సూర్యా నదిపై ఉన్న బ్రిడ్జ్పై మెర్సిడీజ్ కారు డివైడర్ను ఢీకొట్టింది. 54 ఏళ్ల మిస్త్రీతో పాటు జహంగీర్ పండోల్ కూడా స్పాట్లో మృతిచెందాడు. అహ్మదాబాద్ నుంచి ముంబై తిరిగి వస్తున్న సమయంలో మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. ముంబైకి చెందిన గైనకాలజిస్ట్ అనహిత పండోల్ ప్రమాద సమయంలో కారును నడుపుతోంది. సైరస్ మిస్త్రీ, జహంగీర్ పండోల్లు కారులో వెనుక సీట్లో కూర్చున్నారు. అనమిత కారు నడుపుతుండగా, డేరియస్ పండోల్ ముందు సీట్లు కూర్చున్నాడు. కారును ఓ మహిళ నడుపుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఎడమ వైపు నుంచి మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్నట్లు భావిస్తున్నారు.