సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి పలువురు నగరవాసులు మోసపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు.
8 సార్లు ఓటీపీ చెప్పగానే.
ఓ ఆర్మీ ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు లక్షన్నర తస్కరించారు. కొంపల్లికి చెందిన ఆర్మీ ఉద్యోగికి జనవరి 4న ఫోన్కు సందేశం వచ్చింది. పాన్ కార్డును అప్డేట్ చేయాలని.. లింక్ను ఇచ్చామని పేర్కొన్నారు. ఇది నిజమేనని నమ్మిన బాధితుడు ఆ లింక్ను క్లిక్ చేశాడు. ఆ తర్వాత ఓటీపీలు చెప్పడంతో ఆగంతకులు ఆరు సార్లు లావాదేవిలు జరిపి.. రూ. 1.58 లక్షలు కాజేశారు. బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అది నిజమని నమ్మి..
కాచిగూడ, జనవరి 6: లక్ష రూపాయలు విలువ చేసే ద్విచక్రవాహనం తక్కువ ధరకే ఇస్తానంటూ.. ఫేస్బుక్లో ప్రకటన ఇచ్చిన ఓ ఆగంతకుడు నగదు తస్కరించాడు. కాచిగూడ ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం బర్కత్పురలోని మెహర అపార్ట్మెంట్కు చెందిన మదిపెద్ది యాకన్న(31) రూ.18 వేలకే వాహనం అంటే నమ్మి.. ఆగంతకుడు చెప్పినట్లు మొత్తం రూ. 18వేలు డిపాజిట్ చేసి..మోసపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కెమెరాలెన్స్ కోసమని…
బంజారాహిల్స్,జనవరి 6: ఆన్లైన్లో కెమెరా లెన్స్ను కొనేందుకు ప్రయత్నించిన వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. రోడ్ నం. 10లో ఉంటున్న ధీరజ్ కెమెరా లెన్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఓ నంబర్ను సంప్రదించాడు. ఆగంతకులు రూ.27వేలు చెల్లించిన తర్వాత మరింత డబ్బు కావాలని కోరడంతో అనుమానం వచ్చి.. ఆరా తీయగా ఫేక్ ప్రొఫైల్తో మోసం చేసినట్లు తేలింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.