సిటీబ్యూరో, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): ఇన్వెస్ట్మెంట్ పేరుతో దోచుకుంటూ.. హైదరాబాద్లోనే కాల్సెంటర్ తెరిచి సైబర్ మోసాలు చేసేందుకు వచ్చిన ముగ్గురు నేపాలీ నేరగాళ్లను రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 53 మొబైల్ ఫోన్లు, 215 సిమ్కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనర్ మహేశ్భగవత్ శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. తమ వద్ద పెట్టుబడి పెడితే భారీ లాభాలొస్తాయని ఘట్కేసర్కు చెందిన బానోత్ కిరణ్కుమార్ను నమ్మించిన సైబర్నేరగాళ్లు..రూ. 86 లక్షలు మోసం చేశారు. కేసు నమోదు చేసి.. ఇన్స్పెక్టర్ రాము నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకు ఖాతాలు, సెల్ఫోన్ల విశ్లేషణతో పశ్చిమబెంగాల్ నుంచి చీటర్స్ ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించి.. ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపించారు. సిలిగురిలో దీప్ మండల్ ఆధ్వర్యంలో నేరాలు చేస్తున్న నూర్ అలామ్, ఇక్రమ్ హుస్సేన్, మహ్మద్ ఇజ్రుల్లను గత నవంబర్లో అరెస్ట్ చేసి.. వారి బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షలు ఫ్రీజ్ చేశారు.
ప్రధాన నిందితుడు దీప్మండల్ ముఖ్య పట్టణాల్లో కాల్సెంటర్లను తెరిచి.. మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. నేపాల్ సిలిగురికి మధ్య 13 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. దీంతో దీప్ మండల్ నేపాలీలను ఉపయో గించుకుంటూ.. రూ. 15 వేలు నెలకు జీతం ఇస్తూ..వారి పేర్లతో అక్రమ పద్ధతిలో ఆధార్కార్డులు తీయించి బ్యాంకు ఖాతాలు, సిమ్కార్డులు ఇప్పిస్తున్నాడు.
సులువుగా బుట్టలో పడుతారని..
రెండు తెలుగు రాష్ర్టాల్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఈజీగా బుట్టలో పడే బాధితులు చాలా మంది ఉన్నట్లు స్కామ్ సూత్రధారి దీప్ మండల్ గుర్తించాడు. ఇందులో భాగంగా చాలా రోజులుగా బ్యాంకు ఖాతాలు అందిస్తూ.. సిలిగురిలో తనకు అండగా ఉన్న నేపాల్కు చెందిన గోపాల్ శేర్ప, సుశీల్ గురుంగ్, నిమ తమాంగ్లను హైదరాబాద్కు పంపించాడు. ఇక్కడ కాల్సెంటర్ ఏర్పాటుకు స్కెచ్ వేశాడు. విశ్వసనీయ సమాచారంతో ఏసీపీ హరినాథ్ నేతృత్వంలోని సైబర్క్రైమ్ పోలీసులు ముగ్గురు నేపాలీలను శుక్రవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారుడు దీప్ మండల్తో పాటు మనీశ్ చిటారీ మరికొందరి కోసం గాలిస్తున్నారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఇన్స్టాగ్రామ్లో పరిచయమై టీవీ చానల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి.. ఓ మహిళ వద్ద భారీగా డబ్బులు తీసుకొని మోసం చేసిన కడపకు చెందిన సైబర్నేరగాడు వడ్లపల్లి నిత్యకుమార్ను రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): మ్యాట్రీమోనీ సైట్లో పరిచయమైన ఆగంతకుడు.. ఓ యువతి వద్ద రూ. 7.42 లక్షలు కాజేశాడు. షాదీ.కామ్ సైట్లో ప్రొఫైల్ చూసి.. నగరానికి చెందిన యువతిని పెండ్లి చేసుకుంటానంటూ విదేశీయుడు ముందుకొచ్చాడు. ఇద్దరు కొన్నాళ్లు చాటింగ్ చేసుకొని.. పెండ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ‘నిన్ను చూసేందుకు హైదరాబాద్కు వస్తున్నా’ అని అతడు చెప్పాడు. మరుసటి రోజు ఫోన్ చేసి.. తన వద్ద విలువైన వస్తువులు ఉండటంతో తనను ఎయిర్పోర్టులో పట్టుకున్నారని, విడిపించేందుకు డబ్బులు అడుగుతున్నారంటూ.. దఫ దఫాలుగా లక్షలు లాగేశాడు. ఇంకా డబ్బు అడుగుతుండటంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితురాలు శుక్రవారం సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.