సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సమస్యలు సృష్టిస్తారు.. మేమే పరిష్కరిస్తామంటూ బాధితులకు ఫోన్లు చేసి.. అందిన కాడికి దోచేస్తున్న ఢిల్లీ ముఠాలోని ఓ నిందితుడిని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన ప్రశాంత్, సునీల్ అనే యువకులు ‘జన సురక్ష కేంద్ర’ పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. సైబర్ ఫిర్యాదులు, వివిధ వస్తువులు, సంస్థలకు సంబంధించిన వినియోగదారులు ఎదుర్కొనే సమస్యలపై ఫిర్యాదులు చేయవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. న్యాయ సలహాలు తీసుకొని సంబంధిత శాఖకు పంపించాల్సి ఉంటుందంటూ..రుసుము పేరిట డబ్బులు వసూలు చేసేవారు.
మరో వైపు బ్యాంకు అధికారులమంటూ.. కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటూ. అమాయకులను మోసం చేస్తుంటారు. కొద్ది సేపట్లోనే మళ్లీ ఫోన్ చేసి.. ‘మీరు సైబర్నేరగాళ్ల చేతిలో మోసపోయారు.. జన సురక్ష కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేయండం’టూ సూచన ఇస్తారు. సేవల పేరుతో డబ్బులు దండుకుంటారు. ఢిల్లీకి చెందిన 10 మంది ముఠాతో ప్రశాంత్, సునీల్ ఈ మోసాలు చేస్తున్నారు. హైదరాబాద్లో ఇలాంటి కేసు నమోదు కావడంతో ఇన్స్పెక్టర్ కృష్ణ కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ ముఠాను ఢిల్లీ సైబర్సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్పై హైదరాబాద్కు కేసుతో సంబంధమున్న ప్రశాంత్ను అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. రెండు రోజుల పాటు విచారించి గురువారం కోర్టుకు తరలించారు.