భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ)/ ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 19: అకాల వర్షం పంటలను నేలమట్టం చేసింది.. పెట్టుబడి సొమ్ము, రైతుల కష్టాన్ని బూడిదపాలు చేసింది.. అపార నష్టాన్ని మిగిల్చింది.. రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ అన్నదాతల కష్టాన్ని అర్థం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో స్వయంగా పర్యటించారు. దీనిలో భాగంగా బోనకల్లు మండలంలో దెబ్బతిన్న మక్క పంటను పరిశీలించారు. బాధితులను ఓదార్చి అండగా ఉంటామని భరోసానిచ్చారు. అప్పటికప్పుడు ప్రెస్మీట్ పెట్టి రాష్ట్రంలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం నెలతిరక్కుండానే పరిహారం విడుదల చేశారు. బుధవారం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
యుద్ధప్రాతిపదికన సర్వే..
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యవసాయశాఖ అధికారులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని గుర్తించారు. ఏ రైతు ఎన్ని ఎకరాలు సాగు చేశాడు.. ఏయే పంటలు పండించాడు.. ఎంతమేరకు నష్టపోయాడు.. అనే అంశాలను నిర్ధారించుకుని నివేదికలు రూపొందించారు. రైతుల నుంచి బ్యాంకు ఖాతా వివరాలతో పాటు ఇతర వివరాలు సేకరించారు. వాటిని రాష్ట్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు నివేదించారు. సత్వరం పరిహారం అందుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారులు ఇలా..
ఖమ్మం జిల్లావ్యాప్తంగా 18,258 మంది రైతులు 23,632 ఎకరాల్లో పంట నష్టపోయారు. వారి ఖాతాల్లో త్వరలో ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.23.63 కోట్లు జమకానున్నాయి. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 1,978 మంది రైతులు 1,435 ఎకరాల్లో పంటలు నష్టపోయారు. వారి ఖాతాల్లో రూ.1.43 కోట్లు జమ కానున్నాయి.