సిటీబ్యూరో, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ డెవలపర్ల సమాఖ్య ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23 హైటెక్స్లోని హెచ్ఐసీసీలో తొలిసారిగా ‘క్రెడాయ్ కాన్క్లేవ్-2021’ను నిర్వహిస్తున్నదని క్రెడాయ్ చైర్మన్ సీహెచ్ రామచంద్రారెడ్డి తెలిపారు. బిల్డర్లకు ప్రామాణిక నిర్వహణ విధానాలపై అవగాహన కల్పించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటుగా క్రెడాయ్ తెలంగాణ మూడో ఎడిషన్ క్రియేట్ అవార్డులు కూడా అందించనున్నామని చెప్పారు. గురువారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ క్రెడాయ్ ప్రతినిధులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ యూత్వింగ్ కో ఆర్డినేటర్ సి.శ్రీకాంత్ ఆదిత్యా రెడ్డి, క్రెడాయ్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్లు వి.మధుసూదన్ రెడ్డి, బి.పాండు రంగారెడ్డి, జి.అజయ్కుమార్, సుధాకర్ పైప్స్, రాధ టీఎంటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో అత్యుత్తమ ప్రక్రియలను తీసుకువస్తూ.. మిగిలిన వారికి స్ఫూర్తిదాయకంగా నిలుపడమే లక్ష్యంగా ఈ కాంక్లేవ్ను నిర్వహిస్తున్నట్లు రామచంద్రారెడ్డి చెప్పారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఉత్తమ, వినూత్న ప్రాజెక్టులకు క్రియేట్ అవార్డులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 చాప్టర్లలోని మొత్తం 850మంది క్రెడాయ్ సభ్యులు పాల్గొంటారని తెలిపారు. తాజాగా ప్రపంచంలో వస్తున్న ఆవిష్కరణలపై నిర్మాణ రంగంలో సమర్థవంతమైన పద్ధతులను ఉపయోగించుకోవాలని సూచించారు. దీంతో పాటు టీఎస్ బీ పాస్, ధరణి, నిధుల సమీకరణ, జీఎస్టీ నియమాలపై మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ అండ్ రెవెన్యూ విభాగాల ఉన్నతాధికారులు ప్రసంగిస్తారన్నారు. నియమాలు, నిబంధనలపై క్రెడాయ్ సభ్యులు విధిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. క్రెడాయ్ తెలంగాణ చాప్టర్ రూపొందించిన పుస్తకంతోపాటు ‘ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్’పై ప్రత్యేక నివేదికను ప్రముఖ సంస్థ అనరాక్తో కలిసి రూపొందించిందని తెలిపారు.
ఉత్తమంగా రాణించిన సభ్యులకు క్రియేట్ అవార్డులను అందించనున్నట్లు క్రెడాయ్ తెలంగాణ చాప్టర్ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి తెలిపారు. 14 కేటగిరీల్లో ఉత్తమ గ్రీనరీ బిల్డింగ్స్, రెసిడెన్షియల్, కమర్షియల్ బెస్ట్ గ్రీన్ బిల్డింగ్, బెస్ట్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్టు, డెవలపర్ల సీఎస్ఆర్ విభాగాల్లో అవార్డులు అందజేయనున్నారు. రాష్ట్రంలోని విల్లాస్, ఆఫీస్, షాపింగ్ కాంప్లెక్స్ తదితర 7 కేటగిరీల్లో అవార్డులు అందజేస్తారని పేర్కొన్నారు.
క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ ధరణి పోర్టల్లో ఎదురయ్యే సమస్యపై 20 రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వానికి 34 సమస్యలపై విన్నవించామని, వాటిలో ఇప్పటికే 18 సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందన బాగుందని, మిగతావి త్వరలోనే పరిష్కారమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ ఎలక్ట్ ప్రేమ్సాగర్ రెడ్డి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో నూతన ప్రవేశాలకు ఓ మార్గదర్శిగా నిలువడంతో పాటుగా అనుసరించేందుకు అనువుగా ఉంటుందని చెప్పారు. మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంతో పాటుగా నాణ్యమైన ప్రాజెక్టులను అందించేందుకు తోడ్పడుతుందన్నారు.