Credit Card Tips | ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడికెళ్లినా.. ఏ మాల్స్లో షాపింగ్ చేసినా.. ఏ ఈ-కామర్స్ వెబ్సైట్లో ఆర్డర్ బుక్ చేసినా రాయితీలు.. డిస్కౌంట్లు.. క్యాష్ బ్యాక్ ఆఫర్లు.. ఎక్స్చేంజ్ ఆఫర్లు, ఇన్స్టంట్ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ప్రత్యేకించి క్రెడిట్ కార్డులతో వస్తువులు కొనుగోలు చేసినప్పుడు అదనంగా 5-10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. కనుక క్రెడిట్ కార్డుతో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు కొన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓ లుక్కేద్దామా..!
మీ వద్ద ఉన్న క్రెడిట్ కార్డు పరిమితి ఎంత, ఇప్పటి వరకు ఎంత మొత్తం వాడారు.. చెల్లించాల్సిన క్రెడిట్ కార్డు బిల్లు ఎంత తదితర వివరాలు ముందుగా చెక్ చేసుకోవాలి. రివార్డు పాయింట్లు ఎన్ని వస్తాయి. కార్డు బిల్లింగ్ తేదీ సరి చూసుకున్నాకే కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి సంసిద్ధం కావాలి. పూర్తిగా క్రెడిట్ కార్డు వాడకం వివరాలు అవగాహన కలిగి ఉంటేనే దాన్ని ఎంత వరకు వాడొచ్చో క్లారిటీ వస్తుంది.
క్రెడిట్ కార్డుతో ఏ వస్తువు కొన్నా కనీసం నెల రోజుల నుంచి 40 రోజుల టైం లభిస్తుంది. క్రెడిట్ కార్డు బిల్లింగ్ టైం ప్రారంభంలోనే కొనుగోలు చేస్తే ప్రయోజనం లభిస్తుంది. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు బిల్లింగ్ తేదీ 16 నుంచి మొదలైతే.. 17-23 తేదీల మధ్య కొనుగోలు చేయడం వల్ల పే చేయడానికి తగిన టైం లభిస్తుంది.
కొన్ని బ్రాండ్లు, క్రెడిట్ కార్డు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని సాధారణ డిస్కౌంట్ల కంటే ఎక్కువగా స్పెషల్ రాయితీలు ఇస్తాయి. ఫెస్టివ్ సీజన్లోనే ఈ ధోరణి ఎక్కువగా ఉంటుంది. రెండు, మూడు క్రెడిట్ కార్డులు కల వారు ఏ కార్డుతో ఎక్కువ తగ్గింపు లభిస్తుందో చెక్ చేసుకుని ఆ కార్డుతో కొనుగోలు చేస్తే డబ్బు ఆదా అవుతుంది.
క్రెడిట్ కార్డులతో వచ్చే రివార్డ్ పాయింట్లను చెక్ చేస్తూ ఉండాలి. ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు ఈ రివార్డ్ పాయింట్లు వాడే చాన్స్ ఉంటే వదులుకోవద్దు. ఈ రివార్డు పాయింట్ల ద్వారా క్యాష్ వెనక్కి వస్తుందా.. లేదా ? అనే విషయం చెక్ చేసుకోవాలి. కొనుగోళ్లపై అత్యధిక రివార్డు పాయింట్లు ఇచ్చే క్రెడిట్ కార్డునే వాడటం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.
క్రెడిట్ కార్డు జారీ సంస్థలు నో-కాస్ట్ ఈఎంఐ సేవలు అందిస్తున్నాయి. కొన్నిసార్లు మీ వద్ద సరిపడా సొమ్ము లేకపోతే ఈఎంఐల్లోకి మారొచ్చు. వడ్డీ లేకుండా వచ్చే ఈ ఫెసిలిటీ కోసం కొన్నిసార్లు రాయితీలు, డిస్కౌంట్లు వదులుకోవాల్సి రావచ్చు. కొన్ని క్రెడిట్ కార్డు సంస్థలు రాయితీతోపాటు ఉచిత ఈఎంఐ ఫెసిలిటీ కల్పిస్తాయి. అయితే, ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డు పరిమితిలో 30 నుంచి 40 శాతానికి మించి వాడొద్దని బ్యాంక్ బజార్ సీఈవో అదిల్శెట్టి హితవు చెప్పారు.