ఖమ్మం రూరల్, డిసెంబర్ 1: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీలను తన అనుబంధ సంఘాలుగా మార్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని రామ్లీల ఫంక్షన్ హాల్లో పుచ్చకాయల కమలాకర్ అధ్యక్షతన గురువారం జరిగిన సీపీఐ పాలేరు నియోజకవర్గ జనరల్బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురి చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీ సంస్థలను తన ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా పని చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసిన ఘనత మోదీ సర్కార్కే దక్కిందని ఎద్దేవా చేశారు. సీపీఐ నాయకులు బాగం హేమంతరావు, మౌలానా, పోటు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.