హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): గుజరాత్లోని ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసులో అదానీని రక్షించి, ఆ వ్యవహారం నుంచి దృష్టి మళ్లించేందుకే బాలీవుడ్ నటుడు షారుఖ్ఖాన్ తనయుడు ఆర్యన్ఖాన్ను అరెస్టు చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్లోని మగ్ధూంభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ మీదుగా ముంద్రా పోర్టుకు డ్రగ్స్ వచ్చాయని చెప్పారు. హెరాయిన్ అమ్మకాల ద్వారా అదానీ కుటుంబానికి రోజుకు రూ.1,000 కోట్ల ఆదాయం వస్తుందని ఆరోపించారు. ముంద్రా పోర్టుకు వచ్చిన డ్రగ్స్కు సంబంధించిన కార్యాలయం అడ్రస్ విజయవాడలో ఉన్నదని, దీనిని బట్టి వైసీపీ ప్రభుత్వం అమిత్షా కనుసన్నుల్లో నడుస్తున్నట్టు అర్ధమవుతున్నదని విమర్శించారు. విజయవాడలోని హెడ్ ఆఫీస్ నుంచి ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ర్టాలకు హెరాయిన్ సరఫరా అవుతున్నదని ఆరోపించారు. పెగాసెస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కమిటీవేయడం ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. పెగాసెస్ ఇజ్రాయిల్ సాంకేతిక పరిజ్ఞానంతో గూఢచార వ్యవస్థను నడిపిందని, మనదేశంలో జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకులపై నిఘా పెట్టారని విమర్శించారు.