హుస్నాబాద్, జనవరి 19: దేశంలో జరగనున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి జోస్యం చెప్పా రు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి రాకముందు ప్రజలకు, నిరుద్యోగులకు అనేక వాగ్ధ్దానాలు చేసిందని, అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని దుయ్యబట్టారు. యువతకు ఏటా రెండుకోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి విస్మరించిన మోదీ సర్కారును ప్రజలు నమ్మొద్దని కోరారు.
బీసీ బిడ్డనని చెప్పి దేశంలోని బీసీలకు కనీస సౌకర్యాలు కల్పించని ఘనత నరేంద్రమోదీకే దక్కుతుందని విమర్శించారు. పేదలపై పన్నుల భారం మోపి వారిని మరింత పేదలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్న మోదీ పాలనపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. జీఎస్టీ పేరుతో ప్రజలను నిండా దోచుకొంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇంకా అధికారంలో కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. దేశంలోని అన్ని రాష్ర్టాల్లోనూ బీజేపీ పాలన తీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, వచ్చే ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని హెచ్చరించారు.