సిటీబ్యూరో, జనవరి 17(నమస్తే తెలంగాణ): సోషల్మీడియా క్రేజ్ను పెట్టుబడిగా మార్చుకుని, లక్కీడ్రాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఇన్ఫ్లూయెన్సర్లపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పాపులారిటీని అడ్డుపెట్టుకుని ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు.
ఈ మేర కు శనివారం ఎక్స్ వేదికగా రీల్స్లో ఆర్భాటపు ప్రచారాలు చేస్తూ వాస్తవంలో మోసాలకు పాల్పడుతున్న పలువురు ఇన్ప్లూయెన్సర్ల వీడియోలను సజ్జనార్ ఎక్స్లో షేర్ చేశారు. గతంలో బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన కొందరు.. ఆ అక్రమ దందాకు అడ్డుకట్ట పడడంతో ఇప్పుడు లక్కీడ్రాల అవతారమెత్తారని సీపీ అన్నారు. కార్లు, ఖరీదైన బైకులు, ఇళ్లు, డీజే సెట్లు బహుమతులుగా ఇస్తామంటూ ప్రజలకు ఎరవేసి, నిలువునా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై ద ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ 1978 కింద కేసులు నమోదు చేస్తామని , ఈ వ్యవహారంలో సినిమా సెలబ్రిటీలైనా, సోషల్మీడియా స్టారైనా చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోలేరని సీపీ తేల్చిచెప్పారు. లక్కీడ్రాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే తమకు వెంట నే సమాచారం ఇవ్వాలని, ఇందుకోసం డయల్ 100కు గానీ, సిటీపోలీస్ వాట్సప్ నంబర్ 9490616555కు గానీ వివరాలు పంపించాలని సజ్జనార్ ప్రజలను కోరారు.