న్యూఢిల్లీ: కరోనాపై పోరులో త్వరలో మరో ముందడుగు పడనుంది. ఇప్పటికే 15 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందజేస్తుండగా.. మార్చి నుంచి 12 నుంచి 15 ఏండ్ల లోపు పిల్లలకు కూడా టీకా ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. వీరికి భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్, జైడస్ క్యాడిలాకు చెందిన జైకొవ్-డీ వ్యాక్సిన్లు ఇచ్చేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. ఈ విషయాన్ని వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ద నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీ) చైర్మన్ డాక్టర్ అరోరా తెలిపారు. జనవరి 3 నుంచి 15-18 ఏండ్ల టీనేజర్లకు టీకా వేయడం ప్రారంభించారు. వీరిలో ఇప్పటివరకు దాదాపు 3.5 కోట్ల మందికి వ్యాక్సిన్ డోసు వేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు.
ఒమిక్రాన్ కట్టడికి పుణె కంపెనీ టీకా
ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి ప్రత్యేకమైన టీకా రూపొందించినట్టు పుణెకు చెందిన ఔషధ కంపెనీ జెన్నోవా ప్రకటించింది. త్వరలో మనుషులపై దీనిని ప్రయోగించి చూడనున్నట్టు వెల్లడించింది. ఎం-ఆర్ఎన్ఏ విధానంలో ఈ టీకాను రూపొందించినట్టు తెలిపింది. ఈ విధానంలో వైరస్ జెనెటిక్ కోడ్ (ఆర్ ఎన్ఏ)ను మనిషి శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. తద్వారా కలిగే రోగనిరోధకత ఆ వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఎం-ఆర్ఎన్ఏ బూస్టర్ డోసులకు అనువుగా ఉంటుం దని ప్రముఖ వైద్యనిపుణుడు గగన్దీప్ కాంగ్ అభిప్రాయపడ్డారు. అమెరికాకు చెందిన హెచ్డీటీ బయోటెక్ కంపెనీ సహకారంతో జెన్నోవా ఈ వ్యాక్సిన్ను తయారు చేసింది. కాగా, ఒమిక్రాన్ బారిన పడిన రోగుల్లో చాలా తక్కువ మంది దవాఖానలో చేరుతున్నారని కొత్త వేరియంట్ను తొలుత గుర్తించిన దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ వైద్యురాలు ఏంజెలిక్ కోయెట్జీ తెలిపారు. ఒమిక్రాన్కు ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చని వెల్లడించారు.
సమ్మతితోనే పౌరులకు కొవిడ్ టీకా
కొవిడ్ టీకా తప్పనిసరిగా వేసుకోవాలనే నిబంధన ఏదీ లేదని కేంద్రం సోమవారం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా టీకా తీసుకోవడం మంచిదని అఫిడవిట్లో పేర్కొన్నది. తన ఇష్టానికి వ్యతిరేకంగా, బలవంతంగా టీకా తీసుకొమ్మని ఏ వ్యక్తినీ ఒత్తిడి చేయడం లేదని స్పష్టం చేసింది. కొన్ని రకాల సేవలను పొందేందుకు కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపించాలన్న నిబంధన నుంచి దివ్యాంగులను మినహాయించాలంటూ దాఖలైన పిటిషన్పై కేంద్రం పై విధంగా స్పందించింది. సేవలకు టీకా సర్టిఫికేట్ను కావాలంటూ తాము ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని, వ్యక్తుల సమ్మతితోనే టీకా వేస్తున్నట్టు తెలిపింది.