కోల్కతా: వాయిదా పడిన టోర్నీలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుండగా.. మళ్లీ కరోనా వైరస్ పంజా విసురుతున్నది. అన్ని జాగ్రత్తలతో పోటీలు నిర్వహిస్తున్నా మహమ్మారి కలకలం రేపుతున్నది. ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వైరస్ బారినపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీతో పాటు ఫుట్బాల్ ఐ లీగ్లలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. దీంతో ఐ లీగ్ దాదాపు ఆరు వారాల పాటు వాయిదా పడగా.. రంజీ ట్రోఫీ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా సోమవారం పలు టోర్నీల్లో ఆటగాళ్లు, నిర్వాహకులకు కరోనా వ్యాపించింది. బెంగాల్ రంజీ ట్రోఫీ జట్టులో అత్యధికంగా ఏడుగురికి వైరస్ సోకింది. ఆటగాళ్లు సుదీప్ చటర్జీ, మజుందార్, జునైద్, గీత్ పూరీ, ప్రదీప్త, సురజిత్తోపాటు సహాయ కోచ్ సౌరాషిశ్కు పాజిటివ్గా తేలిందని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) కార్యదర్శి స్నేహాషిశ్ తెలిపాడు. మరో పక్క ముంబై రంజీ జట్టులోనూ రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆల్రౌండర్ శివమ్ దూబేతోపాటు వీడియో అనలిస్ట్కు పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈనెల 13 నుంచి రంజీ ట్రోఫీ మొదలుకానుంది.
ఆసీస్ క్రికెట్ సీఈవోకు..
క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సీఈవో నిక్ హక్లీ కరోనా వైరస్ బారినపడ్డాడు. ఇటీవల కాలంలో నిక్ జట్టు సభ్యులను కలవకపోవడంతో ఇంగ్లండ్తో యథావిధిగా యాషెస్ నాలుగో టెస్టు కొనసాగనుంది.
చెస్ టోర్నీలు వాయిదా
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో చెస్ టోర్నీలపై తీవ్ర ప్రభావం పడింది. వైరస్ వ్యాప్తి నేపథ్యం లో జాతీయ జూనియర్, సబ్ జూనియర్, జాతీయ పాఠశాల చాంపియన్షిప్స్ను వా యిదా వేస్తున్నట్లు అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) సోమవారం ప్రకటించింది. ఈనెల 9 నుంచి ఢిల్లీలో జరుగాల్సిన జాతీయ జూనియర్ చాంపియన్షిప్ వాయిదా పడింది.
ఐ-లీగ్ వాయిదా
ఫుట్బాల్ ఐ-లీగ్ వాయిదా పడింది. మొత్తం 45 కేసులు నమోదవడంతో లీగ్ను దాదాపు ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) నిర్ణయం తీసుకుంది. నాలుగు వారాల అనంతరం పరిస్థితిని అంచనా వేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఏఐఎఫ్ఎఫ్ పేర్కొంది. బయోబబూల్లో ఉన్న ఆటగాళ్లు, నిర్వాహకులను పరీక్షలు చేస్తుండగా కేసుల నమోదు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నది. అన్ని ఫుట్బాల్ క్లబ్లలో కలిపి మొత్తం 45 కేసులు నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్త చర్యగా టోర్నీని వాయిదా వేశారు.