లండన్: కోవిడ్-19 మూలాలపై మళ్లీ మొదటి నుంచీ దర్యాప్తు జరపాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వెలువడిన ఓ అధ్యయన నివేదిక ఆశ్చర్యపోయే నిజాలు వెల్లడించింది. వూహాన్ ల్యాబులో చైనా శాస్త్రవేత్తలు వైరస్ను సృష్టించి, అది సహజంగా గబ్బిలాల నుంచి వెలువడినట్టుగా చూపేందుకు అందులో మార్పులు చేశారని బ్రిటిష్ ప్రొఫెసర్ అంగస్ దాల్గేష్, నార్వే సైంటిస్టు డాక్టర్ బిర్గర్ సోరెన్సేన్ వెలువరించిన అధ్యయన పత్రంలో పేర్కొన్నారు. నావెల్ కరోన వైరస్ సార్స్-కోవ్-2 లేదా సింపుల్గా కోవిడ్-19 అనే వైరస్కు విశ్వసనీయమైన పూర్వికులు ఎవరూ లేరని వారు అందులో నిర్ధారించారు. చైనాలోని గుహల్లో నివసించే గబ్బిలాల నుంచి వైరస్ సేకరించి దానిలో మార్పులు చేసి కోవిడ్-19 సృష్టించారని పేర్కొన్నారు. వైరస్ ల్యాబులోనే తయారైందని చెప్పడానికి ప్రత్యేకమైన వేలిముద్రలు కనిపెట్టినట్టు వివరించారు. కేవలం ప్రయోగశాలలో తయారు చేసిన వైరస్ లో మాత్రమే అవి కనిపిస్తాయని నివేదికవలో తెలిపారు, చైనా ల్యాబులలోని డేటాను కావాలనే ధ్వసం చేశారని, ఈ వ్యవహారంపై మాట్లాడిన శాస్త్రవేత్తలను నోరు మూయించారని, కొందరు మాయమయ్యారని తెలిపారు. త్వరలో ఒక సైన్స్ జర్నల్లో ప్రచురితం కానున్న ఈ 22 పేజీల నివేదికను ‘డెయిలీ మెయిల్ డాట్కామ్’ బయటపెట్టింది.