న్యూఢిల్లీ: 5-జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ నటి జూహీచావ్లా దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. నేరుగా దావా దాఖలు చేసే బదులు పిటిషనర్ ముందుగా తన ఆందోళనను ప్రభుత్వానికి నివేదించాల్సిందని కోర్టు అభిప్రాయపడింది. తమ హక్కుల కోసం ప్రభుత్వాన్ని సంప్రదించాలని, అయినా దక్కకుంటే కోర్టుకు రావాలని సూచించింది. జూహీతోపాటుగా వీరేశ్ మాలిక్, టీనా వచానీ ఉమ్మడిగా దాఖలు చేసిన ఈ పిటిషన్ ను జస్టిస్ జేఆర్ మీధా విచారిస్తున్నారు. 5-జీ టెక్నాలజీ వల్ల వెలువడే రేడియేషన్ ఇప్పటికన్నా 10 రెట్లు, 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని, 365 రోజులు.. 24 గంటలు వెలువడుతుండే ఈ రేడియేషన్ మనుషులపై తీవ్రమైన, తిరుగులేని ప్రభావం చూపి భూమి మీదగల పర్యావరణ వ్యవస్థలను శాశ్వతంగా నష్టపరుస్తాయని పిటిషనర్లు తమ పిటిషన్లో తెలిపారు. దీని నుంచి భూమి మీద జీవించే ఏ మనిషి, జంతువు, పక్షి, పురుగు, మొక్క తప్పించుకోవడం సాధ్యపడదని పేర్కొన్నారు. వివిధవర్గాల వాదనలు విన్న తర్వాత కోర్టు తన తీర్పును వాయిదా వేసింది.