వాషింగ్టన్: ఒక జంట అమెరికా, కెనడా సరిహద్దులో పెండ్లి చేసుకున్నది. కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అమెరికాలో ఉంటున్న కరెన్ మహోనీ, బ్రియాన్ రేకు 35 ఏండ్లుగా సాన్నిహిత్యం ఉన్నది. ఈ నేపథ్యంలో ఇంకా ఆలస్యం చేయకుండా వివాహం చేసుకోవాలని వారిద్దరు నిర్ణయించారు. వధువు కరేన్ అమెరికాలోని న్యూయార్క్లో నివసిస్తుండగా కెనడాలోని క్యూబెక్లో ఆమె కుటుంబం ఉన్నది.
కాగా, కరోనా నేపథ్యంలో అమెరికా, కెనడా మధ్య ఉన్న ఆంక్షల నేపథ్యంలో కరేన్ తల్లిదండ్రులు, 96 ఏండ్ల నానమ్మ పెండ్లి కోసం న్యూయార్క్ రావడం కష్టంగా మారింది. దీంతో ఆ జంట తమ పెండ్లి వేదికను ఏకంగా సరిహద్దు వద్దకు మార్చింది. సరిహద్దు భద్రతను పర్యవేక్షించే ఒక స్నేహితుడు వారికి సహాయం చేశారు. దీంతో న్యూయార్క్లోని బర్కి, కెనడాలోని క్యూబెక్ మధ్య ఉన్న జమీసన్ లైన్ బోర్డర్ క్రాసింగ్లో వారి పెండ్లి జరిగింది. అమెరికా వైపు ఉన్న జంట పెండ్లి ప్రమాణం చేయగా, కెనడా వైపు ఉన్న కరేన్ తల్లిదండ్రులు, నానమ్మ ఈ వేడుకను తిలకించారు.
కాగా, ఇరు దేశాల సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ వివాహం గురించి వధువు కరేనా మీడియాకు వివరించారు. ‘పెండ్లి ప్రమాణం చేసే రోజు మా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. నా తల్లిదండ్రులు, నానమ్మ దీనిని ప్రత్యక్షంగా చూడాలని నేను కోరుకున్నాను. జీవించి ఉన్న కుటుంబ పెద్దల్లో నానమ్మ ఒక్కరే. నాకు బాగా తెలిసిన ఏకైక కుటుంబ పెద్ద కూడా ఆమెనే. దీంతో నా జీవితంలో సంతోషకరమైన రోజును చూడటానికి ఆమె నా దగ్గర ఉండటం నాకు చాలా ముఖ్యంగా అనిపించింది’ అని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు ఈ జంట వినూత్నంగా ఇరు దేశాల సరిహద్దు వద్ద పెండ్లి చేసుకున్న వైనం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వారికి వచ్చిన ఈ ఆలోచనను నెటిజన్లు ప్రశ్నించారు. వాట్ యాన్ ఐడియా అంటూ ఈ జంటను ప్రశంసించారు.