న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నది. 2014లో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటికేటికీ రుణభారం విపరీతంగా పెరుగుతూ వస్తున్నది. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నది. రుణం తీసుకొంటే కానీ ప్రభుత్వం నడవలేని స్థితిలోకి దిగజారినట్టు సమాచారం. గత ఆర్థిక సంవత్సరం దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 51.6 శాతం మేర అప్పులు ఉండేవి. ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాలు ఏకంగా 58.8 శాతానికి పెరిగాయి. గత 14 ఏండ్లలో ఈ స్థాయిలో అప్పులు పెరగడం ఇదే తొలిసారి. కాగా, ద్రవ్యలోటు కూడా భారీగా పెరిగింది. గతేడాది జీడీపీలో 4.6 శాతం మాత్రమే ఉన్న ద్రవ్యలోటు.. ఈ ఏడాది ఏకంగా 9.2 శాతానికి పెరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న అప్పులు అధికంగా ఉండటంతో దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకింత లోటు..?
జీడీపీ వృద్ధి రేటు తగ్గడం కారణంగానే జీడీపీలో అప్పుల శాతం పెరిగిందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు కేంద్రప్రభుత్వం రికార్డు స్థాయిలో అప్పులు చేస్తున్నది. దేశంలో అప్పులు పెరగడం వల్ల క్రెడిట్ రేటింగ్ తగ్గుతుంది. దీంతో తీసుకునే అప్పులకు ఎక్కువ వడ్డీలు చెల్లించాల్సి రావొచ్చు. భవిష్యత్తులో ఈ అప్పులన్నీ ఒకేసారి చెల్లించాల్సి కూడా రావొచ్చు. అప్పుడు దేశం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.