న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఇవాళ రాష్ట్రపతి ఎన్నిక కోసం జరిగిన పోలింగ్కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత ఎంపీలు వేసిన ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్రాల నుంచి బ్యాలెట్లను తీసి లెక్కించనున్నారు. ఇవాళ సాయంత్రం వరకు ఫలితాలు వెలుబడే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీపడిన విషయం తెలిసిందే. అయితే ముర్ముకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ద్రౌపది ముర్ము స్వంత ఊరులో అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. ఒడిశాలోని ఉపర్బెడాలో గిరిజనులు స్వీట్లు తయారు చేస్తున్నారు. చాలా వరకు ముర్ముకు మద్దతుగా క్రాస్ ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఒకవేళ గెలుస్తే, ఆమె దేశానికి తొలి గిరిజన రాష్ట్రపతి కానున్నారు. రాష్ట్రపతి ఎన్నిక వేళ సభ్యులకు విప్ జారీ చేయలేదు. నామినేటెడ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మినహా… రాజ్యసభ, లోక్సభ ఎంపీలు, అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఓటేశారు. మొత్తం 4809 ఓటర్లలో 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సోమవారం జరిగిన ఎన్నికలో దాదాపు 99 శాతం మంది ఓటేశారు.