సంగారెడ్డి, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ)/ ఖలీల్వాడి: వేర్వేరు జిల్లాల్లో లంచం తీసుకొంటూ ఇద్దరు అధికారులు ఏసీబీకి దొరికారు. భూసర్వే చేసి హద్దులు నిర్ణయించిన సర్వే రిపోర్టు ఇచ్చేందుకు రూ.20 వేలు లంచం తీసుకొంటూ సంగారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పటాన్చెరు మండలం నందిగామకు చెందిన ఓ మహిళ తన భూమి సర్వే చేసి హద్దులు చూపాలని కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో అధికారులు సెప్టెంబర్లో సర్వే నిర్వహించారు. అయితే నివేదికను మాత్రం సదరు మహిళకు అందజేయలేదు. సర్వే నివేదిక కోసం ఆమె పలుమార్లు అధికారులను కలిసినా ఫలితం లేకపోయింది. డబ్బులు ఇస్తేనే నివేదిక వస్తుందని సిబ్బంది సూచించడంతో సర్వే అండ్ ల్యాండ్ రికార్డు కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ అసిఫ్ ద్వారా ఏడీ మధుసూదన్ను కలిశారు. నివేదిక ఇచ్చేందుకు మధుసూదన్ రూ.20వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితురాలు ఏసీబీని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సోమవారం మధ్యాహ్నం మహిళ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏడీ మధుసూదన్, జూనియర్ అసిస్టెంట్ అసిఫ్ను రెడ్ హ్యాండెండ్గా పట్టుకున్నారు. అనంతరం హైదరాబాద్లోని మధుసూదన్, సంగారెడ్డిలోని ఉన్న అసిఫ్ నివాసాల్లో తనిఖీలు చేపట్టారు.
అద్దె బకాయి చెల్లించేందుకు
అద్దె వాహనానికి చెల్లించాల్సిన బకాయి మంజూ రు చేసేందుకు రూ.15 వేలు లంచం తీసుకొంటూ నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అడ్మినిస్ట్రేషన్ అధికారి శోభన్ బాబు ఏసీబీకి పట్టుబడ్డారు. డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ అంజనకు సంబంధించిన వాహనానికి ఎనిమిది నెలలుగా అద్దె పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉన్న అద్దె డబ్బులను చెల్లించాలని డ్రైవర్ సమీర్ హైమద్ ఏవోను కోరారు. బిల్లు చెల్లించాలంటే రూ.20 వేలు ఇవ్వాలని శోభాన్బాబు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం శోభన్బాబుకు రూ.15 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. శోభన్బాబును అరెస్టు చేసి కరీంనగర్ జైలుకు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ సతీష్కుమార్ తెలిపారు.