సికింద్రాబాద్, నవంబర్ 24: డివిజన్ పరిధిలోని ప్రతి బస్తీలో సీసీ రోడ్ల నిర్మాణాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నట్లు సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ అన్నారు. ఈ మేరకు బుధవారం డివిజన్లోని బీదర్బస్తీలో అధికారులతో కలిసి సుమారు రూ.43లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కార్పొరేటర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..డివిజన్లోని పలు బస్తీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయని, సంక్షేమ పథకాల అమలులో కూడా డివిజన్ ముందంజలో ఉందన్నారు. రానున్న రోజుల్లో సీవరేజీ పనులు వేగవంతం కానున్నాయని, కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ముందుకుసాగుతున్నట్లు తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో ఈఈ రఘు, ఏఈ మధురిమ, డివిజన్ అధ్యక్షుడు నాగేందర్, స్థానిక టీఆర్ఎస్ నేతలు శ్రీను, ప్రసాద్, లలిత, అరుణ, అనిత తదితరులు పాల్గొన్నారు.