సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) సుల్తాన్బజార్: నిరుపేదలకు ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. గురువారం కోఠిలోని డీఎంఈ క్యాంపస్లో ఏడు అంబులెన్స్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో ఎనిమిది వైద్య కళాశాలలను ప్రారంభించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు. ఈక్రమంలోనే వరంగల్, హైదరాబాద్ పరిధిలో ఐదు సూపర్ స్పెషాలిటీ వైద్యశాలల ఏర్పాటు జరుగుతున్నదన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే డీఎంఈ సీనియర్ వైద్యులకు పదోన్నతులు, పోస్టింగ్లు కూడా ఇచ్చామన్నారు.
వరంగల్లో కార్పొరేట్ తరహాలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు సీఎం కేసీఆర్ ఇప్పటికే శంకుస్థాపన చేశారని, త్వరలోనే హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మించబోయే నాలుగు హాస్పిటల్స్కు కూడా సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ నాలుగు దవాఖానలు హైదరాబాద్ జిల్లా పరిధిలో 2, రంగారెడ్డి జిల్లా పరిధిలో 2 వస్తాయన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు హాస్పిటల్స్కు అతి త్వరలోనే సీఎం శంకుస్థాపన చేస్తారని, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అక్కడ శంకుస్థాపన చేయడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఎయిమ్స్ తరహాలో ‘తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (టిమ్స్)ను అభివృద్ధి చేయాలన్నది సీఎం ఆలోచన అని, అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నామన్నారు. టీమ్స్ పరిధిలోనే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ను కార్పొరేట్కు దీటుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
రాష్ట్రంలో 108 అంబులెన్స్ వాహనాలు 429 ఉన్నాయని, వాటిలో పాత వాహనాలను తొలగించి కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అంబులెన్స్లను ఇవ్వడం సంతోషకరమంటూ ఈ సందర్భంగా హ్యుందాయి సంస్థను అభినందించారు. నూతనంగా ప్రారంభించిన అంబులెన్స్లను టీచింగ్ హాస్పిటల్స్లో వినియోగిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, వైద్య, విద్యా సంచాలకులు డాక్టర్ రమేశ్రెడ్డి, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, తదితరులు పాల్గొన్నారు.