జనగామ ఫిబ్రవరి 08 : కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ నివారణ చర్యల వల్ల రాష్ట్రంలో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మంగళవారం జనగామ నుంచి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి పాలకుర్తి నియోజకవర్గంలోని కరోనా బాధితులు, పోలీస్ అధికారులు, తాసిల్దార్లు, ఎంపీడీఓలు, ప్రజా ప్రతినిధులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల, దేవరుప్పుల, పాలకుర్తి, తొర్రూరు, పెద్ద వంగర, రాయపర్తి మండలాల్లో 1223 మందికి గత మూడు రోజులుగా కరోనా టెస్టులు నిర్వహించగా అందులో 22 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందని మంత్రి తెలిపారు.
కరోనా వచ్చిన వారు డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్ల సలహాల మేరకు కరోనా కిట్టులోని మందులు వాడినట్లయితే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని ఆయన తెలిపారు. అందు వల్ల కరోనా బాధితులు ఇంటి వద్దనే హోం హైసోలేషన్ లో ఉండి వైద్యుల సలహా మేరకు చికిత్స పొందాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.
నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారికి సహాయ సహకారాలు అందించడానికి హన్మకొండ లో ఇద్దరు వ్యక్తిగత సహాయకులను, హైదరాబాద్ లో మరో ఇద్దరు వ్యక్తిగత సహాయకులను సిద్ధంగా ఉంచామని ఆయన తెలిపారు.
కరోనా నియంత్రణ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యాక్సినేషన్ ను వంద శాతం నియోజకవర్గంలో అమలు చేసి కరోనాను పూర్తిగా నియంత్రించాలని ఆయన కోరారు.
పాలకుర్తి నియోజకవర్గంలో కరోనా నియంత్రణకు మంత్రి ఎర్రబెల్లి చేస్తున్న కృషి చాలా శ్లాఘనీయమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.