వాషింగ్టన్, నవంబర్ 1: గంటకు 315 మంది.. రోజుకు 7,500 మంది.. నెలకు 2.3 లక్షలు.. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి అది మనుషులను బలిగొన్న తీరిది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మృతుల సంఖ్య సోమవారం 50 లక్షల మార్కును దాటింది. జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. కేవలం 22 నెలల వ్యవధిలో కరోనా వైరస్ సృష్టించిన మహా విలయానికి సంఖ్యా రూపమిది. ఒక్క అమెరికాలోనే ఈ వైరస్ సోకి 7.45 లక్షల మంది చనిపోయారు. కరోనా మహమ్మారి పేద దేశాలనే కాదు.. ధనిక, అత్యంత అధునాతన వైద్య వ్యవస్థ ఉన్న దేశాల్లోనూ కల్లోలం సృష్టించింది. 1950 నుంచి ఇప్పటి వరకు జరిగిన యుద్ధాల్లో చనిపోయినవారి కంటే ఈ 22 నెలల్లో కరోనా వల్ల చనిపోయినవారి సంఖ్యే ఎక్కువని ఓస్లోలోని పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక వైరస్ వ్యాప్తి చాలా దేశాల్లో నెమ్మదించింది. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నా వ్యాప్తి తక్కువగానే ఉంటున్నది. అయితే కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ చాలా మందకొడిగా సాగుతుండటం, టీకా వేసుకోవడానికి ప్రజలు ముందుకు రాకపోవడం తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నది. అర్మేనియాలో కేవలం 7% మంది మాత్రమే వ్యాక్సిన్ వేసుకొన్నారు.