హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి బారిన పడిన 3,909 మంది జర్నలిస్టులకు ఇప్పటివరకు రూ.5.56 కోట్లు అందించినట్టు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కొవిడ్ బాధిత జర్నలిస్టులను తెలంగాణ మీడియా అకాడమీ ఆదుకుంటున్నదని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో కూడా నాలుగు నెలలకాలంలో ఇప్పటికీ 77 మంది కరోనా బాధిత జర్నలిస్టులకు రూ.7.70 లక్షలను సోమవారం బ్యాంకులో జమచేసినట్టు వెల్లడించారు. తొలివిడత కరోనా సమయంలో 1,553 మంది జర్నలిస్టులకు రూ.3.10 కోట్లు, రెండోవిడతలో 2,269 మంది జర్నలిస్టులకు రూ.2.26 కోట్ల ఆర్థికసాయం అందించినట్టు వివరించారు. మీడియా అకాడమీలో ఉన్న రూ.42 కోట్ల కార్పస్ ఫండ్పై వచ్చిన వడ్డీ ఆధారంగా జర్నలిస్టులను ఆదుకుంటున్నట్టు తెలిపారు.