Veenavanka | వీణవంక, మే 20 : సమాజంలో అసాంఘిక చర్యల నియంత్రణ కోసమే గ్రామాల్లో కార్డన్సెర్చ్ నిర్వహిస్తున్నట్లు హుజూరాబాద్ టౌన్ సీఐ కరుణాకర్ అన్నారు. వీణవంక మండలంలోని కోర్కల్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున సీపీ గౌస్ ఆలాం ఆదేశాల మేరకు హుజూరాబాద్ టౌన్ సీఐ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 50 ద్విచక్ర వాహనాలు, 7 ఫోర్ వీల్, ఒక ఇసుక ట్రాక్టర్ పట్టుకొని, సరైన ధృవపత్రాలు లేని వారికి జరిమానా విధించినట్లు తెలిపారు.
అనంతరం సీఐ కరుణాకర్ మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరికీ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని, వాహనాలకు ఇన్సూరెన్స్తో పాటు సరైన ధృవపత్రాలు ఉండాలని అన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో అపరిచితులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వేసవికాలంలో దొంగతనాలకు ఆస్కారం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట రూరల్ సీఐ పులి వెంకట్, వీణవంక ఎస్ఐ ఆవుల తిరుపతి, శంకరపట్నం ఎస్ఐ శేఖర్రెడ్డి, సర్పంచ్ పూదరి రమ్యకృష్ణ-అనిల్, 50 మంది పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.