హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మహంకాళి పోలీసు స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఎం వెంకటేశ్వర్లు(PC 6121)పై వేటు పడింది. డీసీఎం డ్రైవర్పై విచక్షణారహితంగా దాడి చేసిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లను సస్పెండ్ చేస్తున్నట్లు పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అనంతరం వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాణిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లారీ అడ్డా వద్ద రాజు అనే డ్రైవర్ తన డీసీఎం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ రాత్రి రాజు లారీ అడ్డా వద్దే పడుకున్నాడు. అప్పుడే వచ్చిన మహంకాళి పీఎస్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు.. ఇక్కడ్నుంచి వెళ్లిపోవాలని రాజును ఆదేశించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రెచ్చిపోయిన కానిస్టేబుల్.. రాజుపై లాఠీతో విరుచుకుపడ్డాడు. ఒళ్లంతా ఎర్రగా కమిలిపోయింది. కానిస్టేబుల్ వెళ్లిపోయిన తర్వాత, తీవ్ర గాయాలపాలైన రాజు కూడా తన ఇంటికి బయల్దేరాడు. చావుబతుకుల మధ్య ఉన్న రాజును చూసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బాధితుడిని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు.. అనంతరం మహంకాళి పీఎస్కు వెళ్లి ఆందోళనకు దిగారు. రాజుపై లాఠీ ఝులిపించిన కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేసినప్పటికీ, పోలీసులు పట్టించుకోలేదు. మొత్తంగా ఈ విషయం పోలీసు కమిషనర్కు చేరడంతో, ఆయన సీరియస్గా తీసుకున్నారు. కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును సస్పెండ్ చేశారు.