కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 26 : గణపతి నవరాత్రుల్లో మట్టి గణపతిని ప్రతిష్టించి పూజలు చేయాలని, దీనివల్ల పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినవారవుతారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్కుమార్ సూచించారు.
ఈ నెల 31న వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఆలోచనతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 10 వేల మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి శుక్రవారం ఆయన శ్రీకారం చుట్టారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమ మల్టీప్లెక్స్లో ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి, మేయర్ యాదగిరి సునీల్రావుతో కలిసి మట్టి విగ్రహాల పంపిణీ పోస్టర్ ఆవిష్కరించడంతో పాటు, విగ్రహాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణాన్ని రక్షించాలనే గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ శాఖ ద్వారా లక్షలాది మట్టి వినాయక విగ్రహాలను గత ఐదు నెలల నుంచి తయారు చేయించినట్లు చెప్పారు.
ప్లాస్టిక్ నివారణ చర్యలో భాగంగా మక్కజొన్నతో తయారు చేసిన స్టార్చ్ బ్యాగ్లను వాడాలన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ప్రతి మండలంలోని ఎంపీటీసీలు, ఎంపీపీలు, పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో విగ్రహాలను ప్రజలకు అందిస్తామని చెప్పారు.
మట్టి విగ్రహాలను పెట్టి నీటి కాలుష్యాన్ని నివారించాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజలను అవగాహన పరుస్తుందన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ మాజీ చైర్మన్ ఈద్ శంకర్రెడ్డి, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.