పటాన్చెరు/ హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రజల ఆలోచనా తీరుపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నదని, కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్లు తమకున్న అనుకూల అంశాలను విపరీతంగా ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. దీనిపై ప్రజల ఆలోచనాతీరులో మార్పు రావాలని, మరీ ముఖ్యంగా ఉత్తర భారతీయులు మారాలని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతమ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ‘చేంజ్ మేకర్స్’ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులతో ముఖాముఖిలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 45 ట్రిలియన్ డాలర్ల దేశ సంపదను 200 ఏండ్ల కిందట ఆంగ్లేయులు కొల్లగొట్టారని, అభివృద్ధి చెందిన దేశాల్లో రెండో స్థానంలో ఉన్న భారత్ వెనుకబాటుకు గురైందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 90 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారని, జీవన ప్రమాణం 27 ఏండ్ల సగటుతో ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కొన్ని ప్రాంతాలు బాగా వృద్ధి చెందాయని, హార్డ్వేర్, నౌకాశ్రయాలు, రైల్వే, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలతో పాటు పారిశుద్ధ్యం, ప్రజారోగ్యాన్ని వృద్ధి చేసుకోవాలని అభిప్రాయపడ్డారు.
సగటు భారతీయుడు అనారోగ్యానికి గురైతే ఐదు కిలోమీటర్ల లోపు వైద్య సదుపాయాలు లేవని, 26-27 శాతం మంది మాత్రమే కాలేజీ విద్యను అభ్యసించగలుగుతున్నారని చెప్పారు. విద్యను ప్రాథమిక హక్కుగా అమలు చేయటంతో పాటు మూడు పూటలా తిండి, సొంతింట్లో ఉంటూ, పిల్లలకు చదువు, ఉపాధి వంటివి అందిస్తే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.