Kamareddy | మూడు జాతీయ రహదారుల కూడలిలో ఉంటుంది కామారెడ్డి. అభివృద్ధికి అన్ని రకాలుగా అవకాశం ఉన్న ప్రాంతం ఇది. కానీ, పదేండ్ల కింది వరకు పాలకులకు ఏనాడూ అభివృద్ధి పట్టలేదు. ఇక్కడి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ రెండుసార్లూ మంత్రి పదవిని అనుభవించారు. కానీ, ఆయనను గెలిపించిన ప్రజలకు మాత్రం కష్టాలనే మిగిల్చారు.
కేసీఆర్ సర్కార్ వచ్చాకే కామారెడ్డికి కొత్త కళ వచ్చింది. అభివృద్ధి పరుగులు పెడుతున్నది. పదేండ్లలోనే దశ మారింది. కామారెడ్డి జిల్లా కేంద్రమైంది. దశాబ్దాల కల అయిన మెడికల్ కళాశాల ఏర్పాటైంది. గతంలో 14 చదరపు కిలోమీటర్లుగా ఉన్న కామారెడ్డి పట్టణ విస్తీర్ణం నేడు 61.50 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. కామారెడ్డి అభివృద్ధిని చెప్పేందుకు ఇదొక్కటే నిదర్శనం.
పల్లెల్లో అభివృద్ధి పరుగులు
నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలు కూడా కేసీఆర్ పాలనలో పదేండ్లలో సమూలంగా మారిపోయాయి. రూ.15 కోట్లతో టేక్రియాల్ నుంచి నర్సన్నపల్లి, నిజాంసాగర్ చౌరస్తా నుంచి లింగాపూర్కు నాలుగు లైన్ల రోడ్డు వేశారు. మాచారెడ్డి మండలంలో రూ.100 కోట్లు, బీబీపేట్ మండలంలో రూ.48.61కోట్లు, దోమకొండ మండలంలో రూ.32.27 కోట్లు, భిక్కనూర్ మండలంలో రూ.100 కోట్లు, రాజంపేట మండలంలో రూ.59 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ వ్యవస్థ క్రమబద్ధీకరణ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, పంచాయతీ కార్యాలయాల నిర్మాణం, వైకుంఠధామాల ఏర్పాటు వంటి అనేక పనులు జరిగాయి.
షబ్బీర్ చేసింది శూన్యం..
1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన షబ్బీర్అలీ మొదటిసారే మంత్రిగా పని చేశారు. తరువాత 2004లో రెండోసారి గెలిచి మళ్లీ మంత్రి అయ్యారు. రెండుసార్లు మంత్రిగా పనిచేసినా ఆయన చేసిన అభివృద్ధి శూన్యం. విద్యుత్ శాఖ మంత్రిగా షబ్బీర్ పని చేసినప్పుడు అనుభవించిన కరెంటు కష్టాలు కామారెడ్డి రైతులకు ఇంకా కండ్ల ముందే కదలాడుతున్నాయి. అవకాశం ఉండి కూడా అభివృద్ధి చేయడంలో షబ్బీర్ విఫలమైనందునే ఆయనను గత నాలుగు ఎన్నికలలో కామారెడ్డి ప్రజలు తిరస్కరించారు.
మాడల్ టౌన్గా కామారెడ్డి
కేసీఆర్ ప్రభుత్వ పాలనలో కామారెడ్డి పట్టణంలోనే సుమారు రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. ఈ పనుల్లో ముఖ్యమైనవి ఇవి..
☞ సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం
☞ జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణం
☞ సువిశాల ప్రాంగణంలో మెడికల్ కాలేజీ
☞ రూ.13 కోట్లతో కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం
☞ రూ.6 కోట్లతో కళాభారతి ఆడిటోరియం
☞ రూ.4.50 కోట్లతో మాడల్ మార్కెట్
☞ రూ.3 కోట్లతో జంక్షన్ల అభివృద్ధి
☞ రూ.1.65 కోట్లతో సెంట్రల్ లైటింగ్
☞ రూ.1.60 కోట్లతో 4 పార్కుల అభివృద్ధి
☞ రూ.2 కోట్లతో వైకుంఠధామాల అభివృద్ధి
☞ రూ.5 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం
☞ కోటి రూపాయలతో జిల్లా గ్రంథాలయం అభివృద్ధి
☞ పట్టణంలో కళాభారతి నిర్మాణం
☞ రోడ్ల విస్తరణ, లైటింగ్, సుందరీకణ పనులు
☞ మురుగునీటి వ్యవస్థ క్రమబద్ధీకరణ
కేసీఆర్ పోటీతో జోష్
ఈ ఎన్నికల్లో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం ఇక్కడి జనంలో జోష్ నింపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గంప గోవర్ధన్ను గెలిపించినప్పుడే నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారమై అభివృద్ధి మొదలైంది. ఇప్పుడు నేరుగా కేసీఆరే పోటీ చేస్తుండటంతో ఇక కామారెడ్డి అన్ని రంగాల్లో మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ప్రజల్లో నెలకొన్నది. అందుకే ఊర్లకు ఊర్లు కేసీఆర్కే తమ మద్దతు అంటూ తీర్మానాలు చేస్తున్నాయి.