ఖైరతాబాద్, మే 9 : మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఓ కాంగ్రెస్ నాయకురాలిపై.. అదే పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తనకు జరిగిన అన్యాయంపై నిలదీసేందుకు యత్నించిన బాధితురాలిపై అనుచరులతో చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులొకొచ్చింది. సీఐ నిరంజన్ రెడ్డి వివరాల ప్రకారం.. 2020 నారాయణపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డితో కలిసి సమన్వయంతో పనిచేయాలని అధిష్ఠానం ఆదేశించింది.
దాంతో సదరు నాయకురాలు నారాయణపేటలో అతనిని కలిసింది. ఇదే అదనుగా భావించిన శివకుమార్రెడ్డి ఆమెకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు.ఫోన్లో మెసేజ్లు పెట్టేవాడు. ఓ రోజు ఆమెను కలిసి పెండ్లి చేసుకుంటానని చెప్పగా, ఆమె నిరాకరించింది. అప్పటికే అతనికి పెండ్లయిన విషయాన్ని ఆమె ప్రస్తావించగా, తన భార్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నదని, ఆమె మూడేండ్లకు మించి బతకదని చెప్పుకొచ్చాడు. దుబ్బాకలో ఉన్న సమయంలో ఓ రాత్రి శివకుమార్రెడ్డి మద్యం మత్తులో ఆమె గదికి వచ్చి కోరిక తీర్చాలని ఒత్తిడి తెచ్చాడు.
అందుకు నిరాకరించడంతో దాడి చేశాడు. ఆమె కాళ్లా వేళ్లా పడి బతిమిలాడగా వదిలిపెట్టాడు. 2021 జూన్ 24న శివకుమార్రెడ్డి ఆమెను ట్యాంక్బండ్ వద్ద ఉన్న మారియట్ హోటల్కు తీసుకెళ్లాడు. అక్కడ తనతో శారీరకంగా కలువాలని బలవంతం చేశాడు. అంతేగాక, ఆమె మెడలో బలవంతంగా పసుపు తాడు కట్టాడు. మరోరోజు బేగంపేటలోని హోటల్ గ్రాండ్ కాకతీయకు తీసుకెళ్లి మత్తు మాత్రలు కలిపిన శీతలపానీయం తాగించాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాధితురాలు తేరుకోగా, నగ్న చిత్రాలను తీశానని, తన కోర్కె తీర్చకుంటే ఇంటర్నెట్లో పెడుతానని బ్లాక్మెయిల్ చేశాడు. అన్యాయంపై నిలదీసేందుకు శివకుమార్రెడ్డిని సంప్రదించేందుకు బాధితురాలి ప్రయత్నించగా, చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడటం మొదలుపెట్టాడు. బాధితురాలు తమకు ఫిర్యాదు చేయగా, నిందితుడిపై ఐపీసీ 417, 420, 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.