న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శలు గుప్పించారు. జర్మనీలో మోదీ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. 2014 నాటికి భారత్లో సాధించిన అద్భుతమైన విజయాలను ప్రధాని గుర్తించాల్సిందన్నారు. గత ప్రభుత్వాల పనిని మాత్రమే మోదీ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. అన్ని గ్రామాలకు కరెంటు వచ్చిందని ప్రధాని ప్రకటించిన రోజే.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సొంత గ్రామానికి విద్యుత్ సరఫరా చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయన్నారు. ‘ఇదొక్కటే కరెంటు లేని కుగ్రామం కాదు. దేశంలోని అనేక మారుమూల ప్రాంతాలు, గ్రామాలకు ఇంకా విద్యుత్ అందడం లేదని అంగీకరించడానికి సిగ్గుపడాల్సిన పనిలేదు.
దేశంలోని కొన్ని వేల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం లేదని అంగీకరించడంలో సిగ్గుపడాల్సింది లేదు’ అంటూ చురకలంటించారు. గత 75 ఏళ్లలో భారతదేశం సాధించినది నిజంగా ఆకట్టుకుందన్నారు. అయితే, అన్ని ప్రాంతాలకు అవసరమైన సేవలను చేరుకోవడం ఎల్లప్పుడూ కొనసాగే ప్రక్రయ అన్నారు. జీ7 సదస్సులో పాల్గొనేందుకు జర్మనీ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ ఆదివారం మ్యూనిచ్లోని ఆడి డోమ్ స్టేడియంలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో వేలాది మంది భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. కోట్లాది మంది భారతీయులు కలిసి పెద్ద లక్ష్యాలను సాధించిన తీరు అపూర్వమైందని, నేడు, భారతదేశంలోని ప్రతి గ్రామం బహిరంగ మలవిసర్జన రహితంగా ఉందని, విద్యుత్ సౌకర్యం ఉందన్నారు.