హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): గీతకార్మికుల రక్షణ కోసం ఇవ్వాల్సిన కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీని సర్కార్ అటకెక్కించింది. అధికారంలోకి వచ్చేనాటికే సిద్ధంగా ఉన్న 30 వేల కిట్లను పార్లమెంట్ ఎన్నికలముందు హడావుడిగా పంపిణీ చేసి కాంగ్రెస్ పెద్దలు చేతులు దులుపుకొన్నారు. రెండున్నరేండ్లు గడిచినా మిగతావారికి కిట్ల పంపిణీ ఊసెత్తడం లేదు. అదీగాక ముందుగా పంపిణీ చేసిన కిట్లకు సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడం లేదు. దీనిపై గీతకార్మికులు, సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాటిచెట్టు పైనుంచి పడి ప్రతి సంవత్సరం అనేక మంది కల్లుగీత కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రమాదాల నివారణకు, సురక్షితంగా తాటిచెట్లను ఎక్కేందుకు సేఫ్టీ మోకులను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపకల్పన చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని బీసీ సంక్షేమశాఖకు బాధ్యతలు అప్పగించింది. అందుకోసం రూ. 8 కోట్లు కేటాయించింది. ఐఐటీ హైదరాబాద్ సాంకేతిక సహకారంతో సేఫ్టీ మోకులను రూపొందించారు. ఒక్కో సేఫ్టీ మోకు విలువ రూ.12 వేలు. ‘కాటమయ్య రక్షణ కిట్ల పేరిట’ వీటిని పంపిణీ చేయాలని నిర్ణయించగా అసెంబ్లీ ఎన్నికల కోడ్తో ప్రక్రియ నిలిచిపోయింది.
ఆ తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికలముందు ఆ రక్షణ కిట్లను నియోజకవర్గానికి 100 చొప్పున, 100 నియోజకవర్గాల్లో పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించింది. బీఆర్ఎస్ హయాంలో సిద్ధం చేసిన 30 వేల కిట్లను గీతకార్మికులకు పంపిణీ చేసి తామే ఇస్తున్నట్టుగా కాంగ్రెస్ సర్కార్ ప్రచారం చేసుకున్నది. త్వరలోనే మరో 20 వేల కిట్లను పంపిణీ చేస్తామని పేర్కొంది. కానీ రెండున్నరేండ్లు అవుతున్నా ఆ దిశగా చర్యలే చేపట్టలేదు.
రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మంది కల్లుగీత కార్మికులు ఉన్నారు. వారందరికీ విడతలవారీగా కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఆ కిట్లనే విడతకు 10 వేల చొప్పున ఇప్పటివరకు మూడు విడతల్లో 30 వేల మందికి కాంగ్రెస్ సర్కార్ పంపిణీ చేసింది. నాలుగో విడతలో మరో 20 వేల మంది గీతకార్మికులకు పంపిణీ చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటికీ ఇవ్వలేదు. అదీగాక మొత్తంగా మూడు విడతల్లో కిట్ల పంపిణికి సంబంధించి రూ. 31.92 కోట్లు, నాలుగో విడతలో కిట్ల పంపిణీకి రూ. 21.28 కోట్లు అవసరమని అంచనా వేశారు. ప్రభుత్వం బడ్జెట్లో ఆమేరకు నిధులు కేటాయించింది. విడుదలచేసింది రూ.17 కోట్లు మాత్రమే.