(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగాన్ని తమపై బలవంతంగా రుద్దారని దక్షిణ గోవా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి విరియాటో ఫెర్నాండెజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1961లో పోర్చుగీసుల పాలన నుంచి విముక్తి లభించినప్పటికీ.. తమ తలరాతను మాత్రం వేరొకరు రాసినట్టు చెప్పారు. ఈ మేరకు దక్షిణ గోవాలో సోమవారం జరిగిన ఎన్నికల సభలో మాట్లాడారు. ‘2019 లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీతో మాట్లాడా. గోవా ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఇవ్వడంపై ఆయనతో చర్చించా. 1961లో గోవాకు విముక్తి లభించగానే, గోవా ప్రజలపై రాజ్యాంగాన్ని బలవంతంగా రుద్దారని చెప్పా. పోర్చుగీసుల నుంచి విముక్తి లభించిన తర్వాత వారి (గోవా ప్రజలు) తలరాత వారే నిర్ణయించుకొంటారని మాజీ ప్రధాని నెహ్రూ చెప్పినట్టు గుర్తు చేశా. అయితే, మా తలరాతను వేరొకరు రాశారని తెలిపా’ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి విరియాటో భారత రాజ్యాంగాన్ని కించపరిచారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. విభజన రాజకీయాలను కాంగ్రెస్ ఇకనైనా మానుకోవాలని గోవా సీఎం సావంత్ సోషల్మీడియాలో విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ నేతలే కాదు.. బీజేపీ నేతలు కూడా రాజ్యాంగంపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కోవడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 400కు పైగా సీట్లను ఇచ్చి గెలిపిస్తే, రాజ్యాంగాన్ని మారుస్తామంటూ బీజేపీ సీనియర్ నేతలు అనంత్కుమార్ హెగ్డే, గజేంద్ర సింగ్ షెకావత్, లల్లూ సింగ్, జ్యోతి మిర్దా, అరుణ్ గోవిల్ వ్యాఖ్యానించడం రాజకీయ దుమారం రేపింది.