న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: గుజరాత్లో రూ.6 వేల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగినట్టు వెలుగులోకి వచ్చిందని కాంగ్రెస్ బుధవారం తెలిపింది. ఆ రాష్ట్రంలోని చిన్న, మద్యతరహా పరిశ్రమలకు ఉద్దేశించిన బొగ్గును ఇతర రాష్ర్టాల్లోని పెద్ద కంపెనీలకు అమ్మేసుకున్నారని పేర్కొన్నది. నిర్ణీత గడువుతో దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఈ కుంభకోణం చోటుచేసుకున్న 14 సంవత్సరాల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులు (ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ, విజయ్ రూపాణీ, భూపేంద్ర పటేల్) పరిశ్రమలు, గనులు, ఖనిజాల శాఖను తమవద్దే అట్టిపెట్టుకోవడం కాకతాళీయం కాకపోవచ్చని, ఇది అనుమానాలకు తావిస్తున్నదని కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ మీడియాకు చెప్పారు. కోల్ ఇండియా గనుల నుంచి వెలికి తీసిన బొగ్గు ఉద్దేశించిన పరిశ్రమలకు చేరలేదని అన్నారు.
2001 నుంచి 2014 వరకు 14 సంవత్సరాల్లో 60 లక్షల టన్నుల బొగ్గును కోల్ ఇండియా గుజరాత్లోని వ్యాపారులు, చిన్నపరిశ్రమ దారుల పేరిట పంపిందని చెప్పారు. ఆ బొగ్గు సగటు ధర టన్నుకు రూ.1,800 నుంచి రూ.3,000 వరకు ఉంటుంది. కానీ దానిని ఇతర రాష్ర్టాల్లో రూ.8,000 నుంచి రూ.10,000 వరకు అధికధరకు అమ్మారని వల్లభ్ ఆరోపించారు. గుజరాత్ ప్రభుత్వం లబ్ధిదారుల గురించి పంపిన వివరాలు నకిలీవని తేలిందని, ఉద్దేశించిన గమ్యానికి బొగ్గు చేరనే లేదని అన్నారు. బొగ్గు నుంచి లబ్ధి పొందేందుకు బహుశా నకిలీ బిల్లులు సృష్టించి ఉంటారని అన్నారు.