ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 27 : ప్రతి విద్యార్థికి విద్యతో పాటు కంప్యూటర్ శిక్షణ కూడా ముఖ్యమని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ప్రతాపసింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ సెంటర్ను జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సుధీర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. పై చదవులకు వెళ్లే విద్యార్థులు కంప్యూటర్పై అవగాహన లేకుండా ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా పాఠశాలకు గతంలో దాతల సహకారంతో ఏడు కంప్యూటర్లను సమకూర్చినట్లు చెప్పారు. రెండవ దఫా ఐదు కంప్యూటర్లను సమకూర్చడంతో పాటు పాత కంప్యూటర్లకు మరమ్మతులు చేయించినట్లు తెలిపారు. మండలంలోని అన్ని జడ్పీ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ నిచ్చేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. పట్టుదల, క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలు చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, సర్పంచ్ శివశంకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవికుమార్, దాతలు రఘుపతి, ఆశీష్ కుమార్, లెనిన్ కుమార్, సాయి ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.