Puducherry Power Crisis | తమిళనాడు పొరుగున ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్ఛేరి సీఎం, లెప్టినెంట్ గవర్నర్ నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పుదుచ్ఛేరిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ కోతలు నిత్యకృత్యంగా మారాయి. డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ ఇంజినీర్లు మూడు రోజులుగా నిరసన తెలుపుతున్నారు. దీంతో విద్యుత్ సరఫరాలో కోతలు నిత్యకృత్యంగా మారాయి. దీన్ని నిరసిస్తూ ప్రజలు శాంతియుత ప్రదర్శనలకు దిగారు. వరుసగా మూడో రోజు రోడ్లపై బైఠాయించి ప్రజలు నిరసన తెలుపుతున్నారు. రోడ్లపై కొన్ని కిలోమీటర్ల పొడవునా బస్సులు, వాహనాలు నిలిచిపోయాయి. ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది.
అంబగరాథూర్, తెనూర్, తెన్నలక్కుడితోపాటు పుదుచ్చేరి జిల్లాలోని పది గ్రామాలకు పైగా విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో గ్రామాలన్నీ అంధకారంలో మగ్గుతున్నాయి. మరోవైపు తాగునీటి సరఫరా కూడా జరగడం లేదు. దీంతో ప్రజల్లో ఆగ్రహజ్వాలలు పెరిగిపోయాయి. అంబగరాథూర్ గ్రామస్తులు శుక్రవారం నుంచి కరైకాల్-తిరువారూర్ జాతీయ రహదారిపై బ్లాకేడ్కు దిగారు.
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన నిరసన మూడో రోజుకు చేరుకున్నది. విద్యుత్ ఇంజినీర్లు, ఉద్యోగుల నిరసనలుతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.