జనగామ చౌరస్తా, ఫిబ్రవరి 19 : జనగామ జిల్లా రఘునాథ పల్లి మండలం కోమళ్ల గ్రామంలో ఉన్న ఈరన్న గుట్ట క్రషర్ అనుమతులు వెంటనే రద్దు చేయాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు ఆ గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పూర్తి విచారణ జరిపి నివేదికను అందజేయాలని జిల్లా మైనింగ్ శాఖ ఏడీ విజయ్ కుమార్ ను ఆదేశించారు. అనంతరం కోమళ్ల గ్రామ సర్పంచ్ వల్లాల అశోక్, మాజీ సర్పంచ్ బొల్లపల్లి మంజుల మధుసూదన్ మాట్లాడుతూ.. క్రషర్ నిర్వాహకులు కోమల్ల గ్రామ గత పాలక వర్గానికి తెలియకుండా, కనీసం గ్రామసభ తీర్మానం లేకుండా 2023 సంవత్సరంలో నాటి తహసిల్దార్ నుంచి అక్రమంగా ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (ఎన్ ఓసీ)ను పొంది ప్రస్తుతం ఈరన్న గుట్ట వద్ద పనులు చేపట్టారన్నారు.
గత తహసీల్దార్ జారీ చేసిన ‘ఎన్వోసీ’ తేదీ కన్నా ముందుగానే నాటి సర్పంచ్ బొల్లపల్లి మంజుల నేతృత్వంలోని పాలకవర్గం 17 జూన్ 2019 న గ్రామ పరిధిలో ఉన్న పొట్టి గుట్ట, ఈరన్న గుట్టపై గ్రానైట్ క్వారీ, క్రషర్ కు సంబంధించి ఎలాంటి త్రవ్వకాలు జరపొద్దని గ్రామ సభలో తీర్మానం కూడా చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా క్రషర్ నిర్వాకులకు అక్రమంగా జారీ చేసిన ఎన్వోసీని వెంటనే రద్దు చేయడంతో పాటు గ్రామ పాలక వర్గానికి తెలియకుండా దాన్ని జారీ చేసిన గత తహసిల్దార్ పై శాఖ పరమైన విచారణ చేపట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ నర్రా అశోక్, వార్డ్ మెంబర్లు నీల సంపత్, వెలిశాల లావణ్య, బంద మహేశ్వరి, బండి ప్రేమ్ కుమార్, కొరిపెల్లి శ్రీనివాసరెడ్డి, బంద ప్రవీణ్ తాళ్లపల్లి కుమారస్వామి, కన్నారపు ప్రభాకర్, బొల్లపల్లి అశోక్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.