శ్రీరాంపూర్ : సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలు పొందుతున్న నిరుద్యోగ యువతీ, యువకులు సంస్థ పట్ల అంకితభావంతో పని చేయాలని శ్రీరాంపూర్ జీఎం ఎం సురేశ్ కోరారు. శుక్రవారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో 53 మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ దేశ ప్రభుత్వరంగ పరిశ్రమల్లో విభిన్నంగా ఉత్పత్తి, ఉత్పాదకత సాధిస్తు ముందంజలో ఉందన్నారు. కారుణ్య ఉద్యోగాలు పొందుతున్న యువతకు సంస్థలో భవిష్యత్తులో మంచి అవకాశాలుంటాయన్నారు.
కష్టపడి పని చేసిన వారికి మంచి గుర్తింపు ఉంటుందన్నారు. సింగరేణి ఉత్పత్తి లక్ష్యం 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధనకు ప్రతీ కార్మికుడు, ఉద్యోగి కృషి చేయాలని సూచించారు. రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషి చేయాలని కోరారు. సీఅండ్ఎండీ శ్రీధర్ మార్గదర్శనంలో సంస్థ అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. వృత్తి నైపుణ్యాన్ని చాటుకుంటు ఉత్పత్తికి కృషి చేయాలని కోరారు.
శ్రీరాంపూర్లో ఇప్పటి వరకు 2,153 యువతకు కారుణ్య ఉద్యోగాలు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటూజీఎం కే హరినారాయణగుప్తా, ఏజీఎం సుధాకర్, డీవైజీఎం గోవిందరాజు, అరవిందరావు, డీవైపీఎం సుదర్శన్, సీనియర్ పీవో కాంతారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ మాటేటి రాజయ్య, ఫిట్ కార్యదర్శి పీవీ రావు పాల్గొన్నారు.