అమరావతి : ఏపీలో ఉద్యోగుల పీఆర్సీపై స్టీరింగ్ కమిటీ సభ్యులతో మంత్రులు సచివాలయంలోని రెండో బ్లాక్2 ఆర్థిక శాఖ మీటింగ్ హాల్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన, బొత్స, పేర్ని నానితో పాటు స్టీరింగ్ కమిటీ లోని 20 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చర్చల్లో మిగిలిపోయిన ఉద్యోగ సమస్యలు హెచ్ఆర్ఏ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ శ్లాబులో సీసీఏ రద్దు వంటి అంశాల్లో స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
ఈ సందర్భంగా స్టీరింగ్ కమిటీ సభ్యుడు వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ ఇవాళ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. నిన్న జరిగిన చర్చల్లో సమ్మె నోటీస్లో పేర్కొన్న అన్ని సమస్యలను మంత్రుల ఎదుట ఉంచామని, రాత్రి కొన్ని అంశాలపై సానుకూలత వ్యక్త మైందన్నారు. మరి కొన్నింటిపై ఈరోజు చర్చించే అవకాశం ఉందన్నారు. కేంద్ర పీఆర్సీ కాకుండా ఐదేండ్ల కొకసారి పీఆర్సీ చేస్తామని మంత్రులు స్పష్టం చేయడం సానుకూల అంశమన్నారు. ఇప్పటికీ చర్చల పట్ల ఆశాజనకంగా ఉన్నామని తెలిపారు.