హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఆర్థిక వనరులను పెంచుకోవడం ద్వారా స్వయం సమృద్ధి సాధించడంపై తెలంగాణ ఫారెస్ట్ కార్పొరేషన్ (టీఎస్ఎఫ్డీసీ) దృష్టి సారించింది. రోజురోజుకూ విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించడంతోపాటు, కార్పొరేషన్ ఆదాయ వనరులను విస్తరించుకొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా రీజినల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్) పరిసరాల్లో తెలంగాణ ఫారెస్ట్ కార్పొరేషన్ (టీఎస్ఎఫ్డీసీ) ఆధ్వర్యంలో ఉన్న 7.5 వేల ఎకరాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ భూముల్లో ఉన్న నీలగిరి మొక్కల స్థానంలో వాణిజ్య, ఔషధ, పండ్ల మొక్కలతోపాటు కాలుష్యాన్ని నివారించే మొక్కలను నాటుతున్నది. ప్రత్యేకించి ఎర్రచందనం, రోజ్వుడ్, టేకు, శ్రీగంధం, సీతాఫలం, కరివేపాకు, సరుగు, వెదురు మొక్కలను నాటుతున్నది. ఇప్పటికే 2 వేల ఎకరాల్లో ఈ ప్రక్రియ పూర్తయింది. ఆరేండ్లలోగా మిగిలిన భూముల్లో కూడా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. వీటిలో 10 శాతం ఎర్రచందనం, 30 శాతం వెదురు, 10 శాతం రోజ్వుడ్, 20 శాతం కరివేపాకు, సీతాఫలం తదితర మొక్కలను నాటనున్నట్టు ఫారెస్ట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు తెలిపారు.