5 Big changes Today | కాల గర్భంలో మరో నెల కలిసిపోయింది. 2022లో సెప్టెంబర్ నెల మొదలైంది. ఇప్పుడు నెల మారినప్పుడల్లా కొన్ని ఆర్థిక పరమైన మార్పులు జరుగుతున్నాయి. వివిధ చార్జీలు, ఫీజుల చెల్లింపుల వంటి అంశాలతో పర్స్ ఖాళీ అవుతుంది. కేవైసీ పత్రాల దాఖలు చేయడంలో గడువు దాటితే ఆర్థిక లావాదేవీల్లో అంతరాయం ఏర్పడుతుంది. ప్రత్యేకించి మధ్యతరగతి ప్రజానీకంపై భారం పడుతుంది. గ్యాస్ సిలిండర్ ధరతోపాటు ఐటీఆర్ వెరిఫికేషన్, డెబిట్ కార్డుల చార్జీల్లో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి.
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరపై కరుణ చూపని కేంద్ర చమురు సంస్థలు.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ (19 కిలోలు) ధర రూ.91.50 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1976.50 నుంచి రూ.1885కు, కోల్కతాలో రూ.2095.50 నుంచి రూ.1995.50, ముంబైలో రూ.1936.50 నుంచి రూ.1844, చెన్నైలో రూ.2141 నుంచి 2045కి దిగి వచ్చింది.
గత నెల ఒకటో తేదీ తర్వాత ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారు వెంటనే ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. గడువు దాటిన తర్వాత ఐటీఆర్ సమర్పించిన వారికి గతంలో 120 రోజుల గడువు ఉన్న ఈ-వెరిఫికేషన్ ప్రక్రియ 30 రోజులకు కుదించింది కేంద్ర ప్రభుత్వం. ఉదాహరణకు గత నెల 10వ తేదీన ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేసి ఉంటే, ఈ నెల తొమ్మిదో తేదీ లోపు ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. గడువులోపు ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయకపోతే ఆదాయం పన్నుశాఖ అధికారులు మీరు సమర్పించిన ఐటీఆర్ను పక్కన బెట్టేయొచ్చు. ఈ-వెరిఫికేషన్ జాప్యమైనా కొద్దీ రీఫండ్ ఆలస్యం అవుతుంది. ఒకవేళ మరీ ఆలస్యంగా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేస్తే.. మీ ఐటీఆర్ తిరస్కరించే అవకాశాలు లేకపోలేదు. జూలై 31 లోగా ఐటీఆర్ సబ్మిట్ చేసిన వారికి మాత్రం ఈ-వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి 120 రోజుల టైం ఉంది.
పలు బ్యాంకులు ఈ నెల నుంచి డెబిట్ కార్డు చార్జీలు పెంచనున్నాయి. సెమీ కండక్టర్ చిప్ల ధర పెరుగుదల ప్రభావం ఆయా డెబిట్ కార్డుల తయారీపై పడుతున్నది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తన ఖాతాదారుల డెబిట్ కార్డులపై తొలి ఏడాది రూ.50 చార్జీలు, రెండో ఏడాది రూ.150 వార్షిక ఫీజు వసూలు చేయనున్నది. ఇంకా యెస్ బ్యాంక్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఇదే స్థాయిలో చార్జీలు పెంచేశాయి.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద లబ్ధి పొందుతున్న రైతులు గత నెలాఖరులోగా ఈ-కేవైసీ సబ్మిట్ చేయాలని కేంద్రం పేర్కొంది. అలా ఈ-కేవైసీ సమర్పించని రైతుల ఖాతాలు నిలిపివేసే అవకాశం ఉందన్నది. కనుక బుధవారం లోపు ఈ-కేవైసీ అప్డేట్ చేయని రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 12 విడత నిధులు అందుకోవడంలో ఇబ్బందులు పడే అవకాశం ఉందని తెలుస్తున్నది.
నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)లో స్వచ్ఛందంగా చేరిన సభ్యులు తమ ప్రీమియం సొమ్ము నేరుగా ఖాతాలో జమ చేయడం వల్ల పీవోపీలు ఆదాయం కోల్పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారి కమిషన్ 0.10 నుంచి 0.20 శాతానికి పెంచుతున్నట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అధారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ప్రకటించింది. ఈ నిర్ణయం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది.