‘వాగ్మి మహిళా సంఘం’ పేరుతో పదకొండు మంది సాధారణ మహిళలు జట్టుకట్టారు. పలు ఉత్పత్తులకు ప్రాణం పోశారు. తాజాగా మరో సృజనాత్మక ఆవిష్కరణ చేశారు. కొబ్బరిచిప్పలకు కొత్తరూపం ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని ప్రభుత్వ ఇండోర్ స్టేడియం సాక్షిగా వాగ్మి మహిళా సంఘానికి బీజం పడింది. గత ఏడాది దసరా రోజున ఆలేరుకు చెందిన పదకొండు మంది మహిళలు సంఘంగా ఏర్పడి కొత్త ఉత్పత్తులకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ పమేలా సత్పతి చొరవతో ఒక్కో అడుగూ ముందుకేస్తున్నారు. తాజాగా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి సేకరించిన కొబ్బరి చిప్పలతో అందమైన బొమ్మలు తయారు చేస్తున్నారు. వాటిని ఎప్పటికప్పుడు మార్కెట్లో విక్రయిస్తున్నారు.
ఒక్కో బొమ్మ తయారీకి రెండు నుంచి మూడు చిప్పలు అవసరం అవుతాయి. ముందుగా.. చిప్పలపై ఎలాంటి పొట్టూ లేకుండా ఉప్పు కాగితంతో శుభ్రం చేస్తారు. వాటిపై మూడు పొరలుగా రంగులు వేస్తారు. ఇందుకు మార్కెట్లో దొరికే వర్ణాలతోపాటు, స్కెచ్ పెన్లను వినియోగిస్తారు. రెండు చిప్పలను ఒకదానిపై ఒకటి పెట్టి.. మధ్యలో గుండ్రంగా చుట్టిన కాగితాన్ని ఫెవికాల్తో అతికించి కలిపేస్తారు. తర్వాత పైచిప్పపై స్కెచ్లతో కండ్లు, ముక్కు, పెదాలు, చెవుల ఆకృతి గీస్తారు. తలకు రెండు వైపులా ప్రత్యేకమైన దారంతో జుట్టు పెడతారు. ఇలా ఎనిమిది గంటలు శ్రమించి అందమైన రూపునిస్తారు. వీటిని రూ.150 చొప్పున అమ్ముతున్నారు. ప్రతి సోమవారం భువనగిరిలోని కలెక్టరేట్లో స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. బొమ్మల కొలువులు, షోకేస్ అలంకరణ కోసం జనం ఇష్టంగా కొంటున్నారు.
అనేక ఉత్పత్తులు
ఇప్పటికే, గుట్టదేవుడి నిర్మాల్యంతో అగరుబత్తీలు తయారు చేస్తున్నారు వాగ్మి సభ్యులు. ‘కటాక్ష’ పేరుతో వాటిని మార్కెట్లో విక్రయిస్తున్నారు. వృథా కాగితాలతో ఎకోఫ్రెండ్లీ పెన్సిళ్లు, పెన్నులకు రూపం ఇస్తున్నారు. కుంకుమ, పసుపు, ఫొటో ఆల్బమ్లు, విగ్రహాల తయారీకి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ‘ఎంతో ధైర్యంతో సంఘాన్ని ప్రారంభించాం. స్వయం ఉపాధి లక్ష్యంగా అడుగులు వేశాం. ఈ ప్రయాణంలో స్థానిక తాసీల్దార్ ప్రోత్సాహం మరువలేనిది’ అంటారు వాగ్మి సభ్యురాలు ధనలక్ష్మి.