Singareni | గోదావరిఖని, జనవరి 22: సింగరేణి ఆర్జీ-1 జీడీకే-2ఏ గనిలో సోమవారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మందల సమ్మిరెడ్డి అనే మైనింగ్ సర్దార్ తీవ్రంగా గాయపడ్డాడు. గనిలో బొగ్గు బయటకు తీసుకొచ్చే టబ్బుల లింకు తెగి కార్మికుడిని ఢీకొట్టడంతో ఆయన కాళ్లు, చేతులు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. మొదట ‘ఖని’ సింగరేణి దవాఖానకు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కామినేని దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న ఏడుగురు కార్మికులు టబ్బులు తగలకుండా తప్పించుకున్నా రు.
యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని గుర్తింపు సంఘం కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, నాయకుడు ఆరెల్లి పోచం ఆరోపించారు. ఉత్పత్తి లక్ష్యం చేరుకోవాలన్న ఆతృతలో కార్మికులకు రక్షణ చర్యలు కల్పించడంలో, క్రమం తప్పకుండా రక్షణ సమావేశాలు నిర్వహించడంలో యాజమాన్యం విఫలమైందని విమర్శించారు. ఈ ఘటనకు యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు రామస్వామి, వెంకటరెడ్డి, ప్రభుదాస్ ఉన్నారు.