Statue of Equality | నగర శివార్లలోని ముచ్చింతల్లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల (Ramanujacharya) సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనారాయణయాగం నిర్వహించనున్నారు. ఈ యాగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. 12 రోజులపాటు జరగనున్న ఈ మహాక్రతువులో రెండో రోజు ఉత్సవాలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి. యాగశాలలో అగ్నిహోత్రం ఆవిష్కరణ, 1035 కుండలాల్లో శ్రీ లక్ష్మీ నారాయణ హోమం జరుగుతుంది. ఈ హోమాన్ని ఐదు వేల మంది రుత్విక్కులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జీయర్ స్వాములు, రుత్వికులు, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
1.5 లక్షల కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యి..
రామానుజాచార్య సమారోహంలో భాగంగా 12 రోజులపాటు నిర్వహంచనున్న మహా యజ్ఞం కోసం మొత్తంగా 1.5 లక్షల కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వినియోగించనున్నారు. ఈ నెయ్యి మొత్తాన్ని రాజస్థాన్ రాష్ట్రం పాత్మెడాలోని పూర్తి స్వదేశీ ఆవులను తీసుకొచ్చి ముచ్చింతల్, తాండూరులలోని వ్యవసాయ క్షేత్రాల్లో పోషిస్తూ వాటి పాల నుంచి సంప్రదాయ పద్ధతుల్లో తయారుచేశారు. త్రిదండి చినజీయర్స్వామి మార్గనిర్దేశకత్వంలో దాదాపు 6 నెలల ముందునుంచే యజ్ఞం కోసం నెయ్యిని సిద్ధం చేయడం మొదలుపెట్టడం విశేషం. యజ్ఞ సమిధలను సైతం శాస్త్రబద్ధంగా తయారుచేశారు.