హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): కేంద్రం విద్యుత్ సంస్కరణల పేరుతో తెస్తున్న చట్టాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం ప్రగతిభవన్లో క్యాబినెట్ సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ రైతులు, మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకోవడానికి ఇంకో దుర్మార్గమైన కరెంట్ చట్టాన్ని కేంద్ర తెస్తున్నదని మండిపడ్డారు. రైతుల మెడ మీద కత్తి పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి బోరు కాడ మీటరు పెట్టాలని కుట్ర చేస్తున్నదని చెప్పారు. విద్యుత్తు సంస్కరణల మీద మాట్లాడాలంటూ.. ముఖ్యమంత్రితో నాకు సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర పవర్ మినిస్టర్ ఆర్కే సింగ్ లేఖ పంపించారని చెప్పారు. ‘ప్రతి బోరు కాడ మీటర్ పెట్టడం.. లేకపోతే రాష్ర్టానికి వచ్చే అప్పులు కట్చేయడం.. రాష్ట్రం మెడ మీద కత్తి పెట్టి, రాష్ట్రాల హక్కులు, అధికారాలు హరించి, పవర్ మీద పెత్తనం మొత్తం కేంద్రం తీసుకోవడమే సంస్కరణలంటే ఇవేనా’ అని మండిపడ్డారు. ‘పెత్తనం తీసుకొన్నాక అన్ని రాష్ర్టాలకు సమానంగా ఇస్తాం, మీకు 24 గంటలు ఇవ్వం, మీరు కూడా 16 గంటలే వాడుకోవాలే ఇవేనా మీ రీఫార్మ్స్’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
మా మెడమీద కత్తి పెట్టుడు ఏంది..
‘మేం కష్టపడి.. కిందా మీద పడి చెడిపోయిన దాన్ని మంచిగ చేసుకొని ఇవాళ శుభ్రంగా 24 గంటల కరెంట్ ఇచ్చుకొంటున్నాం. దాన్ని కూడా నాశనం చేస్తరట. దాని మీద సమాధానం ఏంది. వాటీస్ పవర్ రీఫార్మ్. బోరు కాడ మీటర్ పెట్టి రైతుల ముక్కు పిండి వసూలు చేయమని చెప్తలేరా మీరు. రైతులు నాశనం కావాలా. ఈ దేశంలో ఉండొద్దా. వ్యవసాయం పంటలు పండొద్దా. ఇయ్యకపోతే ఇయ్యకుండి మీరు పరిపాలించే దగ్గర ఇయ్యకండి. వేరే పార్టీలు పరిపాలించే దగ్గర మేం ఇచ్చుకుంటాం అనుకుంటున్నం.. మీకేం అబ్జెక్షన్. పవర్ రీఫార్మ్స్ పేరుతో మా మెడ మీద కత్తి పెట్టుడు ఏంది?’ అంటూ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.