హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): అడవి బిడ్డల హకుల పోరాట యోధుడు కుమ్రంభీం ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ‘మా గూడెం, మా తండాలో మా రాజ్యం’ అనే ఆదివాసీల తరతరాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం నిజం చేసిందని గుర్తుచేశారు. శుక్రవారం ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రంభీం జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ సీఎం కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, పథకాలు అమలుచేస్తున్నదని పేర్కొన్నారు. భీం జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జోడేఘాట్ను అన్ని హంగులతో అభివృద్ధి చేశామని, భీం స్మారక చిహ్నం, సృ్మతి వనం, గిరిజన మ్యూజియం ఏర్పాటుచేసి ఆయన పోరాట పటిమను భవిష్యత్ తరాలకు తెలియ పరిచేలా అన్ని మౌలిక వసతులు కల్పించామని వివరించారు. ఆదివాసీల ఆత్మగౌరవాన్ని నిలిపేలా హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్లో ఆదివాసీ భవన్ నిర్మాణం చేపట్టామని, ఈ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైందని తెలిపారు. ‘జల్ జంగల్ జమీన్’ అనే కుమ్రంభీం నినాదం.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ.. స్వరాష్ట్ర అభివృద్ధి పథంలోనూ ఇమిడి ఉన్నదని పేర్కొన్నారు.