ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోని అటవీ భూములను రక్షించి తీరాలి. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ ప్రజలు బతకలేని పరిస్థితి ఉంటే ఏం లాభం? అడవులను రక్షించుకొంటేనే భవిష్యత్తు తరాలకు మేలు చేసినవారమవుతాం. దట్టంగా ఉన్న అడవులను రక్షించుకోవాలి. ఆక్రమణలు తొలగించి, ఉద్దేశపూర్వకంగా అడవులను నాశనం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తేతెలంగాణ): పోడు భూముల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శ్రీకారం చుట్టారు. నవంబర్ ఎనిమిది నుంచి డిసెంబర్ 8 వరకు దరఖాస్తులు స్వీకరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పోడు సమస్య పరిష్కారంలో అడవిబిడ్డలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోడు సమస్యను పరిష్కరిస్తూనే, అటవీ భూములను రక్షించి దట్టమైన అడవులు పెరిగేలాచేయాలని సూచించారు. అడవులను నాశనం చేసే శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పీడీ చట్టం కింద కేసులు నమోదుచేయాలని జిల్లాల కలెక్టర్లు, అటవీ, పోలీస్శాఖ అధికారులను ఆదేశించారు. పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ రక్షణ, పునర్జీవం, హరితహారంపై కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమం, పోలీస్, పంచాయతీరాజ్శాఖల ఉన్నతాధికారులతో శనివారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అడవుల రక్షణలో అన్ని స్థాయిల్లోని సంబంధిత శాఖల అధికారులతో పాటు, గ్రామ సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు.
రెండు గ్రామాలకు ఒక నోడల్ అధికారి
పోడు సాగుచేసుకొంటున్న గిరిజన రైతుల నుంచి నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు క్లెయిమ్ దరఖాస్తులు స్వీకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నవంబర్ 8లోగా వివిధ స్థాయిల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటుచేసి ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం గ్రామ కమిటీల నియామకం చేపట్టాలన్నారు. రెండుమూడు గ్రామాలకు ఒక నోడల్ అధికారిని నియమించాలని, సబ్డివిజన్ స్థాయిలో ఆర్డీవో, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు. 87% పోడు భూముల ఆక్రమణ భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లోనే ఉన్నదని సీఎం అన్నారు.
అటవీ భూములను రక్షించి తీరాలి
ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోని అటవీ భూములను రక్షించి తీరాలని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ ప్రజలు బతకలేని పరిస్థితి ఉంటే ఏం లాభమని ఆవేదన వ్యక్తంచేశారు. అడవులను రక్షించుకొంటేనే భవిష్యత్తు తరాలకు మేలు చేసినవారమవుతామని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా అడవులను నాశనం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గిరిజనులు అడవికి రక్ష
గిరిజనులు అడవిని కంటికి రెప్పలా కాపాడుకొంటారని, బయటి నుంచి వచ్చే శక్తులే అడవిని నాశనం చేస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. బయటి నుంచి వచ్చే శక్తులు అడవులను ధ్వంసం చేయకుండా కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలన్నారు. ఫారెస్ట్ లోపల పోడు సాగుచేస్తున్న గిరిజనులకు సమీపంలోని ప్రభుత్వ భూములను సాగుకు కేటాయించాలని, ప్రభుత్వ భూములు లేకుంటే అడవి అంచన సాగు భూమి కేటాయించి నీరు, విద్యుత్తు, నివాస సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. అటవీ భూములకు శాశ్వత సరిహద్దులు (బౌండరీలు) నిర్ణయించి రక్షణ కంచెలు ఏర్పాటుచేయాలని, కంచెపై గచ్చకాయ ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. ట్రెంచ్ ఏర్పాటుకు అటవీ నిధులతోపాటు ఉపాధి హామీ పథకం నిధులను ఉపయోగించుకోవాలని సూచించారు.
10 ఎకరాల అడవి లక్షల మొక్కలతో సమానం
సోషల్ ఫారెస్ట్లో భాగంగా ఎన్ని కోట్ల మొక్కలు నాటినా ఒక అడవితో సమానం కాదని సీఎం కేసీఆర్ అన్నారు. పది ఎకరాల అడవి కొన్ని లక్షల మొక్కలతో సమానమని పేర్కొన్నారు. గజ్వేల్లో అడవుల పునరుజ్జీవం చేపట్టినట్టుగానే అన్ని జిల్లాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అడవి లేని జిల్లాల్లో ఖాళీగా ఉన్న అటవీ భూముల్లో అడవులను అభివృద్ధి చేయాలని సూచించారు. పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల అభివృద్ధి మంచి ఆలోచన అని సీఎం అధికారులను అభినందించారు.
జిల్లాల్లో అఖిలపక్ష సమావేశాలు…
పోడుభూముల సమస్య పరిష్కారం, అటవీ భూముల రక్షణ అంశాలపై అన్ని జిల్లాల్లో అఖిల పక్ష సమావేశాలను నిర్వహించాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు పోడు భూములను సాగు చేసుకొంటున్న గిరిజనులు, తదితరులకు ఆర్వోఎఫ్ఆర్ హక్కులు కల్పించడంతోపాటు, ఆ తర్వాత అటవీ భూమి ఇంచు కూడా ఆక్రమణకు గురి కాకూడదనే విషయంలో అఖిలపక్ష నాయకుల నుంచి ఏకాభిప్రాయం తీసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు అడవుల రక్షణను ఒక బాధ్యతగా తీసుకొనేలా ప్రోత్సహించాలని కోరారు. సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్రావు, అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్ శోభ, సీఎంవో సెక్రటరీలు స్మితా సబర్వాల్, భూపాల్రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు తదితరులు పాల్గొన్నారు.
గంజాయి సాగుచేస్తే అన్ని సౌకర్యాలు బంద్
గంజాయి సాగుచేసే రైతులకు రైతుబంధు, రైతుబీమా, విద్యుత్తు సౌకర్యం నిలిపివేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గంజాయి సాగుచేసేవారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు సూచించారు. ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో గంజాయి సాగు చేస్తే పట్టా రద్దుచేసేలా చర్యలు తీసుకోవడంతోపాటు, ఇతర చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలన్నారు. గుడుంబా తయారీని పూర్తిస్థాయిలో అరికట్టి తయారీదారులకు ఉపాధి, పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.