హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): పిల్లలకు పుష్టికరమైన ఆహారంతో కడుపు నింపితేనే వారు చదువుపై మనస్సు నిమగ్నం చేస్తారని, ఆపై ఆటపాటల్లో రాణిస్తారని భావించిన సీఎం కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ పథకానికి రూపకల్పన చేశారు. అమ్మలా ఆలోచించి ప్రారంభించిన ఈ పథకానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థి దశలో మేధో వికాసమే లక్ష్యంగా మధ్యాహ్న భోజనం, బెల్లం కలిపిన రాగిజావ, పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసుల సమయంలో ఉచితంగా స్నాక్స్ వంటి కార్యక్రమాలను ప్రభు త్వం ఇప్పటికే అమలు చేస్తున్నది. వాటికి కొనసాగింపుగా సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. పిల్లల్లో విద్యా ప్రమాణాల పెంపు, వారి మేధో సామర్థ్యాలను పెంచేందుకు తొలిమెట్టు, లక్ష్య, ఉన్నతి వంటి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రభుత్వం.. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు, హాజరును మెరుగుపరిచేందుకు, డ్రాపౌట్స్ను తగ్గించడమే లక్ష్యంగా సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించింది.
రాష్ట్రవ్యాప్తంగా 27,147 ప్రభుత్వ జిల్లా, మండల పరిషత్తు, ఎయిడెడ్, మాడల్ సూళ్లు, మదర్సాలలో చదువుకుంటున్న దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుంది. ఈ పథకం అమలుకు ఏటా రూ.500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనున్నది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపాహారం అం దించే పథకాన్ని సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు సహా రాష్ట్రవ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యే లు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, అధికారులు ప్రారంభించారు. ఉత్సాహభరిత వాతావరణంలో, విద్యార్థులు, తల్లిదండ్రుల కోలాహలం మధ్య ఈ పథకం ప్రారంభమైంది.
దేశంలో మధ్యాహ్నభోజన పథకాన్ని 1 నుంచి 8 వ తరగతుల వరకే అమలుచేస్తుండగా.. రాష్ట్రంలో 9, 10 తరగతులకు కూడా విస్తరించి సీఎం కేసీఆర్ మానవీయతను చాటారు. దీనికోసం ప్రభుత్వం అదనంగా రూ.137 కోట్లు ఖర్చు చేస్తున్నది. దొడ్డు బియ్యానికి బదులు సన్నబియ్యం, వారానికి మూడు గుడ్లను అదనంగా అందజేస్తున్నది. సన్నబియ్యం కోసం రూ.187 కోట్లు, గుడ్ల కోసం రూ.120 కోట్లు అదనంగా భరిస్తున్నది. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు మన ఊరు-మన బడి వంటి కార్యక్రమాలతో పాటు, క్రీడా సౌకర్యాలు, మౌలిక సౌకర్యాల పెంపు, పాఠశాలల అభివృద్ధి, ఉపాధ్యాయులు, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, ఇతర సిబ్బంది నియామకం వంటి ఎన్నోచర్యలను ప్రభుత్వం చేపట్టింది.