నిజామాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం ప్రారంభించారు. రూ.58 కోట్లతో నిర్మించిన కలెక్టరేట్ను శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, ఆశన్నగారి జీవన్రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, షకీల్ అహ్మద్, సురేందర్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, జడ్పీ చైర్మన్లు దాదన్నగారి విఠల్ రావు, దఫేదార్ శోభతో కలిసి ప్రజలకు అంకితంచేశారు.
జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డిని ఆయన సీట్లో కూర్చోబెట్టి ఆశీర్వదించారు. అనంతరం కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వాధికారులను ఉద్దేశించి కొద్దిసేపు మాట్లాడారు. అందరి కృషితో దేశంలోనే తెలంగాణ అనేక రంగాల్లో పురోగమిస్తున్నదని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. క్వెస్ట్ ఫర్ ఎక్స్లెన్స్ అంటే ఒక ప్రయత్నం, ఒక ప్రారంభం, ఒక ప్రస్థానం అనీ.. తెలంగాణ కూడా ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రగతిని సాధిస్తున్నదని వివరించారు. పట్టుదల, కృషి, ఐక్యతతో మనమంతా పనిచేస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
అంతకుముందు సీఎం కేసీఆర్ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో నిజామాబాద్కు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకున్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడినుంచి ఎల్లమ్మగుట్టలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. గులాబీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలను వేశారు. పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. ఆశన్నగారి జీవన్రెడ్డిని జిల్లా అధ్యక్షుడి కుర్చీలో కూర్చోబెట్టి ఆశీర్వదించారు. అనంతరం టీఆర్ఎస్ ముఖ్య నేతలతో కాసేపు ముచ్చటించారు.